Kota Srinivasa Rao: తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ నటుడిగా వెలుగొందారు కోట శ్రీనివాసరావు. విల‌న్‌గా, క‌మెడియ‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా రాణించారు. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయి నటించే వారు. తెలుగులోనే కాదు, త‌మిళం, క‌న్నడ‌, మ‌ల‌యాళ‌ సినిమాల్లోనూ ఆయన నటించారు. ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. వయోభారం కారణంగా గత కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రీసెంట్ గా ఓ వెబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు. తన జీవితంలో ఎన్నో బాధలు అనుభవించినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదాలు తమ కుటుంబంలో తీరని శోకం నింపినట్లు వెల్లడించారు.  


రిక్షాను లారీ ఢీకొట్టడంతో మా కూతురు కాలు పోయింది- కోట


తన కూతురుకు రిక్షాలో ఎక్కడం అంటే చాలా సరదగా ఉండేదని చెప్పారు. ఓసారి విజయవాడలో తన బంధువుల పిల్లలతో కలిసి కోట కూతురు రిక్షా ఎక్కిందట. సరదాగా రిక్షా ప్రయాణం చేస్తుండగా ఊహించని ఘటన జరిగిందట. ఎదురుగా వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో కోటా కూతురు ప్రయాణిస్తున్నన రిక్షాను ఢీకొట్టడంతో పాటు అక్కడున్న కొంత మంది మీది నుంచి దూసుకెళ్లిందట. ఈ ప్రమాదంలో ముగ్గురు, నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, తన కూతురు ప్రాణాలతో బయటపడిందని చెప్పారు కోట. అయితే, ఓ కాలు కోల్పోయినట్లు చెప్పారు. ఆ సమయంలో తమ ఇళ్లంతా దుఃఖ సాగరంలో మునిగిపోయినట్లు చెప్పారు.  


గుమస్తాగా ఎవరి దగ్గర పని చేశానో ఆయనతోనే వియ్యం అందుకున్నా-కోట


తన కూతురు భవిష్యత్ ఏంటా? అని ఆందోళన పడుతున్న సమయంలోనే ఓ మంచి వార్త విన్నట్లు చెప్పారు కోట శ్రీనివాసరావు. తను  ఒకప్పుడు బ్యాంకులో ఎవరి దగ్గర అయితే గుమస్తాగా పని చేశారో ఆయనతోనే వియ్యం అందుకున్నట్లు చెప్పారు. వారింటికే తన కూతురు కోడలిగా వెళ్ళిందన్నారు. మంచి కుటుంబంలో ఆమె జీవితం హ్యాపీగా కొనసాగుతుందని చెప్పారు. ఇప్పుడు ఆమెకు ఓ కూతురు  ఉందని చెప్పారు. ఇక అంతా సెట్ అయ్యింది, కుటుంబం హ్యాపీగా ఉందని అనుకుంటున్న సమయంలోనే మరో రోడ్డు ప్రమాదం తన కుటుంబాన్ని అతలాకుతలం చేసిందన్నారు. యాక్సిడెంట్ లో తన కొడుకు చనిపోయినట్లు వెల్లడించారు. కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు పడినా, సినిమాల్లో ఆ బాధను కనిపించకుండా జాగ్రత్త పడ్డానని చెప్పారు కోట.


కోటా చనిపోయారంటూ నెట్టింట్లో ఊహాగానాలు


ఇక రీసెంట్ గా కోట గురించి ఓ విషాదబరితమైన వార్త సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కోట శ్రీనివాసరావు చనిపోయాని చాలా మంది నెటిజన్లు పోస్టులు పెట్టారు. ఈ వార్తలపై కోట ఆవేదన వ్యక్తం చేశారు.  తాను ఆర్యోగంగానే ఉన్నానని, వదంతులు నమ్మొద్దని కోరారు. “నేను మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. నా ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయడం మంచిది కాదు.  ఈ వార్తలు చూసి నా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు బాధపడ్డారు. దయచేసి బతికున్న నన్ను చంపేయకండి” అని కోట ఆవేదన వ్యక్తం చేశారు.  


Read Also: ‘జబర్దస్త్’ స్టేజ్‌పై గుండు కొట్టించుకున్న బుల్లెట్ భాస్కర్, కోపంతో షో నుంచి వెళ్లిపోయిన ఖుష్బూ!