Kangana Ranaut On Stars Performing At Ambani's Event: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా ఈ సంబురాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ బాష్ జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు ప్రపంచ దిగ్గజాలు హాజరయ్యారు. హాలీవుడ్ స్టార్స్, అంతర్జాతీయ టెక్ అధినేతలు, క్రికెటర్లు హాజరయ్యారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా పలు సినీ పరిశ్రమలకు చెందిన స్టార్స్ పాల్గొన్నారు. ఆటపాటలతో సందడి చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ వేడుకలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీ వెడ్డింగ్ వేడుకలుగా నిలిచాయి.  


సినీతారల ఆట పాటలపై కంగనా సటైర్లు


ఇక ఈ వేడుకల్లో సినీ తారలు డ్యాన్సులు చేయడంపై బాలీవుడ్ నటి కంగనా సటైర్లు వేసింది. దివంగత గాయని లతా మంగేష్కర్ గతంలో చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఐదు మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినా తాను పెళ్లిళ్లలో పాటలు పాడబోనని లతా మంగేష్కర్ గతంలో తేల్చి చెప్పారు. ఆ వార్తకు సంబంధించిన పేపర్ కటింగ్ ను తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా కంగనా షేర్ చేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, లతా మంగేష్కర్ మాదిరిగానే వ్యవహరిస్తానని చెప్పుకొచ్చింది. ఎన్నో చక్కటి ఆఫర్లు వచ్చినప్పటికీ, పెళ్లిళ్లలో, అవార్డుల వేడుకలలో ప్రదర్శన ఇచ్చేందుకు ఒప్పుకోలేదని వెల్లడించింది. "నేను చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కానీ, కొన్ని నిర్ణయాలను ఎప్పుడూ మార్చుకోలేదు. పెళ్లిళ్లలో, అవార్డుల వేడుకలలో ప్రదర్శనలు ఇవ్వడానికి చాలా ఆఫర్లు వచ్చాయి. పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్లు వచ్చాయి. పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించారు. కానీ, నేను వాటికి దూరంగా ఉన్నాను. ఇక ముందు కూడా అలాగే ఉంటాను. డబ్బు కంటే గౌరవం ముఖ్యం అని నేను బలంగా నమ్ముతాను. అందుకే, డబ్బుల కట్టలు వస్తున్నా వద్దు అనుకున్నాను. యువత కూడా అర్థం చేసుకోవాలి. షార్ట్స్ కట్స్ మంచిది కాదు. ఆ దారిలో వెళ్తే ఇబ్బందులు తప్పవు” అని కంగనా చెప్పుకొచ్చింది.   


అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దూరంగా కంగనా


మార్చి 1 నుంచి 3 వరకు గుజరాత్‌ జామ్‌ నగర్‌ లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రిహన్న, ఇవాంకా ట్రంప్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి అంతర్జాతీయ అతిథులు వచ్చారు. అయిప్పటికీ, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మాత్రం దూరంగా ఉంది.  భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరు కావడంతో ఈ వేడుక ప్రపంచ పత్రికల్లో టాప్ ప్రయారిటీని పొందింది.  


Read Also: నీతా అంబానీ మెడలో పచ్చలహారం - దీని ధర ఎన్ని కోట్లో తెలుసా?