Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'కల్కి 2898 AD'. ఇందులో బాలీవుడ్ భామలు దీపికా పడుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా.. విశ్వ నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ను మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ఇంతకముందెన్నడూ చూడని యోధుడి లుక్ తో ఆకట్టుకున్నాడు. అయితే చాలా రోజులుగా మరో అప్డేట్ లేకపోవడం.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఓ సరికొత్త అప్డేట్ తో వచ్చింది. 


'కల్కి 2898 AD' సినిమా కోసం ప్రభాస్, దిశా పటానిల మధ్య ఓ డ్యూయెట్ సాంగ్ ఉంటుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ, 'ఇటలీలో ఆట పాట' అంటూ సముద్రం ఒడ్డున సాంగ్ షూట్ చేస్తున్నట్లు మేకర్స్ లేటెస్టుగా ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పటికే షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని ఫోటోలు బయటకి రాగా, ఇప్పుడు చిత్ర యూనిట్ అఫీషియల్ ఓ కొత్త ఫోటోని షేర్ చేసింది. ఇందులో ప్రభాస్, దిశా పటాని, డైరెక్టర్ నాగ్ అశ్విన్ లతో పాటు మొత్తం చిత్ర యూనిట్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కల్కి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. 






'కల్కి 2898 AD' చిత్రాన్ని మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ప్రమోషన్స్ చెయ్యాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్, దిశా పటానీలపై చిత్రీకరిస్తున్నది ఓ రొమాంటిక్ సాంగ్ అని.. ఇది ఈ మూవీలోని చివరి సాంగ్ అని టాక్ నడుస్తోంది. ఇక మహా శివరాత్రి నుంచి ప్రమోషన్స్ షురూ చెయ్యాలని భావిస్తున్నారట. వరుసగా అప్డేట్లు అందిస్తూ, ఏప్రిల్ 9 నాటికి ట్రైలర్ రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.


హిందూ పురాణాల ఆధారంగా ఒక ఎపిక్ సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ సినిమాగా 'కల్కి 2898 AD' ని తీర్చిదిద్దుతున్నారు. క్రీ.శ. 3102 నుండి క్రీ.శ. 2898 మధ్య జరిగే కథతో.. ప్రేక్షకులను ఒక సరికొత్త వరల్డ్ లోకి తీసుకెళ్లడానికి నాగ్ అశ్విన్ టీమ్ కృషి చేస్తోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే శాన్ డియాగో కామిక్-కాన్ ఈవెంట్‌ లో రిలీజైన ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసాయి. ఈ సినిమా కచ్చితంగా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. 


'కల్కి 2898 AD' అనేది పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు నిర్మాత సి అశ్వినీ దత్. స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నిషియన్స్ ఇందులో భాగం అయ్యారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. 'తుంబాడ్' ఫేమ్ నితిన్ జిహాని చౌదరి ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ సినిమాని భారతీయ భాషల్లోనే కాదు, పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Also Read: హీరో రామ్ పోతినేనితో శర్వానంద్ కు ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా?