Janhvi Kapoor Hospitalised: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. తాజాగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. ప్రస్తుతం ‘ఉలఝ్’ సినిమాతో బిజీగా ఉన్న ఈ భామ.. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా తన తండ్రి బోణీ కపూర్.. మీడియాకు తెలిపారు. అంతే కాకుండా రెండు రోజుల్లోనే జాన్వీ కపూర్ డిశ్చార్జ్ అయిపోతుందని కూడా స్పష్టం చేశారు. దీంతో ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో మాత్రమే కాకుండా టాలీవుడ్‌లో కూడా బిజీగా గడిపేస్తోంది జాన్వీ కపూర్. ఇదే సమయంలో ఇలా జరగడంపై జాన్వీ త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ మెసేజ్‌లు పెడుతున్నారు.


చాలా వీక్‌గా ఉంది..


గురువారం సౌత్ ముంబాయ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాన్వీ కపూర్ అడ్మిట్ అయ్యింది. అక్కడ డాక్టర్లు తనకు తీవ్రంగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తను బిజీ షెడ్యూల్‌లో ఉండడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వగానే ముందుగా తన షెడ్యూల్స్ అన్నింటిని బుధవారానికి పోస్ట్‌పోన్ చేసింది. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా కూడా ఒక వారం రోజుల పాటు రెస్ట్ తీసుకున్న తర్వాత మన తన షెడ్యూల్‌ను కంటిన్యూ చేయాలని నిర్ణయించుకుందట జాన్వీ. తను చాలా వీక్‌గా ఉందని, అయినా త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తోందని సన్నిహితులు చెప్తున్నారు.


ప్రస్తుతం జాన్వీ కపూర్ చెన్నైలో షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇటీవల చెన్నై నుంచి ముంబాయ్‌కు వచ్చింది. వచ్చిన వెంటనే తనకు కాస్త అస్వస్థతగా అనిపించడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది. ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్‌లో కూడా జాన్వీ కపూర్ చాలా బిజీగా ఉంది. ఇటీవల అట్టహాసంగా జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో తన చెల్లి ఖుషి కపూర్‌తో కలిసి సందడి చేసింది జాన్వీ. అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, సంగీత్‌లో తన అల్లరి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. పైగా వారికోసం జాన్వీ కపూర్ స్పెషల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. ఒకపక్క అనంత్ అంబానీ పెళ్లిలో బిజీగా ఉన్నా కూడా మరోవైపు తన అప్‌కమింగ్ మూవీ ‘ఉలఝ్’ ప్రమోషన్స్‌ను కూడా కవర్ చేసింది.


తెలుగు డెబ్యూకు సిద్ధం..


తన అప్‌కమింగ్ మూవీ ‘ఉలఝ్’లో సుహానా భాటియా పాత్రలో కనిపించనుంది జాన్వీ కపూర్. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని సుధాన్షు సారియా డైరెక్ట్ చేశారు. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో జాన్వీతో పాటు ఆదిల్ హుస్సేన్, మియాంగ్ చాంగ్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి.. ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఇక జాన్వీ కపూర్ డెబ్యూ తెలుగు మూవీ అయిన ‘దేవర’ కూడా అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో తను జూనియర్ ఎన్‌టీఆర్‌తో జతకట్టింది. దీంతో పాటు రామ్ చరణ్ అప్‌కమింగ్ మూవీలో కూడా జాన్వీ కపూరే హీరోయిన్.



Also Read: నాకు ఎవరినీ నగ్నంగా చూడాలని లేదు, అందుకే పారిపోయి వచ్చేశాను - ఆ పార్టీలపై సుచిత్ర కృష్ణమూర్తి వ్యాఖ్యలు