Pawan Kalyan's Hari Hara Veera Mallu Title Story: 'హరిహర వీరమల్లు'.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అవెయిటెడ్ పీరియాడిక్ అడ్వెంచరస్ మూవీ. ఈ సినిమా నుంచి పవర్ ఫుల్ 'అసుర హననం' అనే సాంగ్ను తాజాగా మేకర్స్ 5 భాషల్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో దర్శక నిర్మాతలకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
అందుకే ఈ టైటిల్..
ఈ మూవీ రెండు పార్టులుగా రానుందని.. ఫస్ట్ పార్ట్ 'స్వార్డ్ వర్సెస్ స్పిరిట్'ను జూన్ 12న విడుదల చేస్తామని డైరెక్టర్ జ్యోతికృష్ణ తెలిపారు. 'స్వార్డ్ అంటే ఖడ్గం అని అర్థం. అందుకు నిదర్శనమే బాబీ డియోల్ రోల్. ఇక స్పిరిట్ అంటే ధైర్యం అని అర్థం. దాన్ని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రోల్లో చూపించాం. వీరిద్దరి మధ్య జరిగే వార్ 'హరిహర వీరమల్లు'. అందుకే ఈ టైటిల్ పెట్టాం.' అని చెప్పారు.
అదే నాకు పెద్ద అవార్డు
పవన్ కల్యాణ్ను డైరెక్ట్ చేయడమే తనకు పెద్ద అవార్డు అని జ్యోతికృష్ణ తెలిపారు. 'ఈ ప్రాజెక్టుకు ప్రధాన కారణం క్రిష్. ఆయన టార్చ్ వేసి నాకు ఇస్తే నేను పూర్తి చేశాను. ఈ పాటకు 'అసుర హననం' అనే టైటిల్ను కీరవాణి సెలక్ట్ చేశారు. ఈ సాంగ్లోని ఫైట్స్ అన్నీ పవన్ కల్యాణ్ డిజైన్ చేసి కొరియోగ్రఫీ చేశారు. 60 రోజులు షూటింగ్ చేశాం.' అని వెల్లడించారు.
పవన్కు బిగ్ ఫ్యాన్
తాను పవన్కు బిగ్ ఫ్యాన్ అని.. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని హీరోయిన్ నిధి అగర్వాల్ తెలిపారు. 'హరిహర వీరమల్లు నాకు చాలా స్పెషల్. 5 ఏళ్ల క్రితం మేము దీన్ని ప్రారంభించాం. అప్పటికి ఇప్పటికీ నాలో ఎన్నో మార్పులు వచ్చాయి.' అని నిధి చెప్పారు.
ఐటెం సాంగ్ ఉంది
ఈ సినిమాకు పవన్ కల్యాణ్కు మాత్రమే సరిపోతుందని.. ఆయన మూర్తీభవించిన ధర్మాగ్రహం అంటూ కీరవాణి తెలిపారు. 'దర్శకుడు జ్యోతికృష్ణకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమాకు సంబంధించి అన్నీ పనులు ఒక్కరే చూసుకున్నారు. ఇందులో మరో 3 పాటలు ఉన్నాయి. అవి రిలీజ్ చేసిన తర్వాత ట్రైలర్ ఉంటుంది. ఇందులో ఓ ఐటెం సాంగ్ ఉంది. ఆ పాటలో పవన్ను ఉద్దేశించి కొన్ని లిరిక్స్ రాశాం. ఇప్పుడు తనపై బాధ్యత ఎక్కువ ఉందంటూ పవన్ వాటిని మార్చారు. ఆయన గొప్పతనానికి ఇది నిదర్శనం.' అంటూ కీరవాణి పేర్కొన్నారు.
పవర్ స్టార్ పవర్ చూపించేలా 'సమర శంఖారావమల్లే ఘింకరించు ఆగ్రహం.. వైరమైన, శౌర్యమైన మ్రోగు మరణ మృదంగం..' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. శత్రువుల గుండెలు చీల్చేలా పోరాట యోధుడిలా పవన్ కల్యాణ్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ సినిమాకు సగానికి పైగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత కొన్ని కారణాలతో ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. రెండో పార్ట్కు కూడా ఆయనే దర్శకత్వం వహించనున్నారు. సినిమాలో అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, నోరాహి ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్తా, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 12 ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.