Ravi Teja-Prasanth Varma: 'హను-మాన్‌' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ ఇండియన్ సూపర్ హీరో మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. చిన్న సినిమాగా విడుదలై, ఎవరూ ఊహించని అతి పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌ వేదికగా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ తన సినిమాటిక్ యూనివర్స్ లో మాస్ మహారాజా రవితేజ కూడా భాగం అయ్యే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. 


ప్రశాంత్ వర్మ డెబ్యూ మూవీ 'అ!' లో చేప పాత్రకు వాయిస్ ఓవర్ అందించిన హీరో రవితేజ.. ఇప్పుడు 'హను-మాన్‌' చిత్రంలో కోటి అనే కోతి పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తావిస్తూ.. తన సినిమాటిక్ యూనివర్స్‌లో ఆ పాత్రను మరింత ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. దీని కోసం ఇప్పటికే ఓ ఇంట్రెస్టింగ్ లైన్ అనుకున్నామని, రవితేజ అంగీకరిస్తే PVCU లో ఆయనతో ఒక సినిమా చేయాలని తన మనసులోని కోరికను బయటపెట్టారు. 


ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. ''మా సినిమాలో మోస్ట్ ఎంటర్టైనింగ్ చేసిన మాస్ మహారాజా రవితేజ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తానని మూడేళ్ల క్రితమే ఆయన నాకు మాటిచ్చారు. కానీ ఆయన నటించిన మూవీ(ఈగల్) మా సినిమాతో పాటే సేమ్ టైంలో రిలీజ్ కు ఉంది.. వాయిస్ ఇస్తారా లేదా?, అసలు అడిగితే బాగుంటుందా? ఇంకేమైనా చేద్దామా? అని ఆలోచించాను. చివరకు కాస్త డౌట్ ఫుల్ గానే కోటి పాత్రకు వాయిస్‌ ఓవర్‌ ఇస్తారా అని అడిగా. దానికి ఆయన వెంటనే 'సరేరా చేసేద్దాం' అన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది ఇంత జెన్యూన్ పర్సన్ నాకు దొరకడం హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాలో భాగమైనందుకు రవితేజ గారికి థ్యాంక్స్'' అని అన్నారు. 


''మా సినిమాటిక్ యూనివర్స్‌లో కోటి పాత్రను ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తే మాకు ఓ ఇంట్రెస్టింగ్ ఐడియా వచ్చింది. రవితేజ గారు ఒప్పుకుంటే కోటి క్యారక్టర్ తో ఆయనతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను'' అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో 'హను-మాన్' డైరెక్టర్ తో రాబోయే రోజుల్లో మాస్ రాజా మూవీ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ రవితేజ అంగీకరించి, ఈ కాంబినేషన్ కుదిరితే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ అవుతుందేమో చూడాలి.


ఇకపోతే రవితేజ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఏడాది పొడవునా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. 'ఈగల్' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసిన ఆయన.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అలానే సితార బ్యానర్ లో అనుదీప్ కేవీ డైరెక్షన్ లో ఓ సినిమాకి కమిట్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా 'జై హనుమాన్' అనే మూవీని  ప్రకటించారు. ఇది ‘హను-మాన్‌’ కు సీక్వెల్‌. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇందులో ఆంజనేయ స్వామిగా ఓ స్టార్ హీరో నటించనున్నారు. దీని తర్వాత ప్రశాంత్ ఓ సూపర్ విమెన్ సినిమా చేయనున్నట్లు వెల్లడించారు.


Also Read: 'పుష్ప 2' To 'సలార్ 2'.. బాక్సాఫీస్ ని ఢీకొట్టబోయే క్రేజీ సీక్వెల్స్!