Tollywood Upcoming Sequels: టాలీవుడ్ లో ప్రస్తుతం 'సీక్వెల్స్' ట్రెండ్ నడుస్తోంది. ఆల్రెడీ హిట్టైన కథలకు కొనసాగింపుగా రెండు లేదా మూడు సినిమాలు తీయడానికి, ఒకే కథను రెండు భాగాలుగా చెప్పడానికి మన దర్శక రచయితలు ఆసక్తి కనబరుస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుండటంతో నిర్మాతలు సైతం సీక్వెల్ సినిమాలకు సై అంటున్నారు. 'బాహుబలి', 'కేజీఎఫ్' లాంటి ఫ్రాంచైజీలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో, అందరూ అదే దారిలో పయనిస్తున్నారు. తెలుగులో ఎప్పుడూ లేనన్ని సీక్వెల్స్ ఈ ఏడాదిలో తెర మీదకు రాబోతున్నాయి. వాటిల్లో కొన్ని సినిమాలు ఇప్పటికే సెట్స్ మీద ఉండగా, మరికొన్ని ప్రాజెక్ట్స్ అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం. 


'పుష్ప: ది రూల్'.. 'సలార్: శౌర్యంగ పర్వం'... 
2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో 'పుష్ప: ది రూల్' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో, మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు 'పుష్ప 2' మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఇప్పటికైతే ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ - 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'సలార్ - పార్ట్ 1: సీజ్ ఫైర్'. గతేడాది క్రిస్మస్ కు రిలీజైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. దీంతో ఇప్పటికే ప్రకటించబడిన 'సలార్ - పార్ట్ 2: శౌర్యంగ పర్వం' సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. 


రెండు భాగాలుగా 'దేవర'..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురానున్నారు. ఫస్ట్ పార్ట్ ని ఏప్రిల్ 5న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీ, ఇప్పుడు వాయిదా పడబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఎప్పుడు రిలీజైనా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. తారక్ దీని తర్వాతే 'దేవర 2' పై దృష్టి పెట్టనున్నారు. ఇక పూరీ జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో 'డబుల్ ఇస్మార్ట్' అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. ఇది వీరి కలయికలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి సీక్వెల్. 


Also Read: 'రత్నం' చేసాడు.. 'డిటెక్టివ్ 2' మీద ఫోకస్ పెట్టాడు! 


అటు 'కార్తికేయ'.. ఇటు 'హనుమాన్'...
డైరెక్టర్ చందు మొండేటి - హీరో నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ ప్రాంచైజీ 'కార్తికేయ'. 'కార్తికేయ 2' సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన తర్వాత, దీనికి కొనసాగింపుగా 'కార్తికేయ 3' ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన 'హను-మాన్' సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా 'జై హనుమాన్' మూవీని ప్రకటించారు. పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయినట్లు దర్శకుడు తెలిపారు. 


సోగ్గాడు మళ్ళీ రాబోతున్నాడు...
 కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన ద్విపాత్రాభినయం చేసిన సూపర్ హిట్ సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'. దీనికి కొనసాగింపుగా వచ్చిన 'బంగార్రాజు' మూవీ హిట్ అవ్వడంతో, 'బంగార్రాజు 2' చేసే ఆలోచనలో ఉన్నారు కింగ్ నాగ్. ఇటీవల 'నా సామిరంగ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బంగార్రాజు ఫ్రాంచైజీని కంటిన్యూ చెయ్యనున్నట్లు స్పష్టం చేసారు. అడవి శేష్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'గూఢచారి'. ఇప్పుడు ఈ చిత్రాన్ని సీక్వెల్ గా 'గూఢచారి 2' (G 2) తెరకెక్కుతోంది.


'హిట్ 3' తో నాని.. 'టిల్లు స్క్వేర్' తో సిద్ధు...
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన న్యూ ఏజ్ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ 'డీజే టిల్లు'. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' రూపొందుతోంది. ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సిన ఈ మూవీ లేట్ అవుతూ వస్తోంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇక హీరో నాని నిర్మాణంలో డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ప్రాంచైజీ 'హిట్'. ఇప్పటికే విడుదలైన రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో, 'హిట్ 3: ది థర్డ్ కేస్' కూడా చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఈ ప్రాంచైజీలో మరికొన్ని సినిమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. 


Also Read: ‘మీర్జాపూర్ 3' to 'ఫ్యామిలీ మ్యాన్ 3' - 2024లో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ సీక్వెల్స్ ఇవే!


అంజలి ప్రధాన పాత్రలో నటించిన 'గీతాంజలి' సినిమాకి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలానే దిల్ రాజు బ్యానర్ లో శర్వానంద్ హీరోగా తెరకెక్కించిన 'శతమానం భవతి' చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేసారు. అంతేకాదు 'శతమానం భవతి 2' సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుందని పేర్కొన్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమాకు కొనసాగింపుగా మరో మూవీ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. 'పొలిమేర' ప్రాంచైజీలో మరికొన్ని చిత్రాలు రానున్నట్లు క్లారిటీ వచ్చింది. 'స్కంద' 'పెదకాపు' లాంటి సినిమాలకు కూడా సీక్వెల్స్ ఉంటాయని అన్నారు కానీ, రిజల్ట్ చూశాక అవి తెరకెక్కడం అనుమానమే.


బాలయ్య 'అఖండ 2' & 'ఆదిత్య 999 మ్యాక్స్'...
'అఖండ' చిత్రాని సీక్వెల్ ఉంటుందని నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కంఫర్మ్ చేసారు. అదే బాలయ్య తన 'ఆదిత్య 369' సినిమాకి కొనసాగింపుగా 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే మూవీ ప్లాన్ చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే తెలిపారు. నందమూరి మూడో తరం వారసుడు మోక్షజ్ఞ ఈ ప్రాజెక్ట్ తోనే హీరోగా లాంచ్ అవుతాడనే వార్తలు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. ఇక అదే ఫ్యామిలీకి చెందిన నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ 'బింబిసార' సినిమాకి సీక్వెల్ గా 'బింబిసార 2' ఉంటుందని ప్రకటించారు. ఇవే కాకుండా ఇతర భాషల్లో రూపొందనున్న 'భారతీయుడు 2', 'బ్రహ్మాస్త్ర 2' 'వార్ 2', 'యానిమల్ పార్క్', 'కేజీఎఫ్ 3' చిత్రాలకూ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. 


Also Read: మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దేవిశ్రీ - అర డజనుకు పైగా సినిమాలతో రాక్ స్టార్ ఫుల్ బిజీ