Sankranti 2024 Telugu movie releases : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న 'గుంటూరు కారం' సినిమా సంక్రాంతి బరిలో విడుదల అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి స్పష్టం చేశారు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా నటించిన 'ఆదికేశవ' సినిమాను నవంబర్ 10 నుంచి 24కు వాయిదా వేసిన విషయం చెప్పడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంక్రాంతి బరిలో సినిమాల పోటీ గురించి నాగవంశీ మాట్లాడారు.  


నేనెందుకు వేరే నిర్మాతలను అడగాలి? : నాగవంశీ 
'గుంటూరు కారం'ను సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్లు గతంలో చెప్పారు. ఆ తేదీకి తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'హను - మాన్' సినిమా వస్తుంది. తర్వాత రోజు... అంటే జనవరి 13న విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో 'సైంధవ్', మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' సినిమాలు కూడా వస్తున్నాయి. 


సంక్రాంతి బరిలో పోటీ గురించి సూర్యదేవర నాగవంశీ దగ్గర ప్రస్తావిస్తూ వేరే నిర్మాతలతో మాట్లాడారా? అని ప్రశ్నించగా... ''నేను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగా 'మీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి?' అని! 'గుంటూరు కారం' అని చెప్పారు. నేను ఎందుకు వేరే నిర్మాతలను అడగాలి?'' అని చెప్పారు. ఇంతకు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'గుంటూరు కారం' రెండు వందల శాతం సంక్రాంతికే వస్తుందని కూడా నాగవంశీ తేల్చి చెప్పేశారు. 


Also Read : మాటల్లేవ్ - విక్రమ్ 'తంగలాన్' టీజర్, ఆ యాక్షన్ చూశారా?






రికార్డు రేటుకు నైజాం రేట్స్ కొన్న 'దిల్' రాజు
'గుంటూరు కారం' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 'దిల్' రాజు రికార్డు రేటుకు కొన్నారని, నాన్ రాజమౌళి సినిమాల్లో ఇదే హయ్యస్ట్ బిజినెస్ అని నాగవంశీ చెప్పారు. అలాగే సినిమా నుంచి ఫస్ట్ పాటను 99 శాతం దసరాకు విడుదల చేస్తామని ఆయన తెలిపారు. మహేష్ బాబును ఈ మధ్య కాలంలో చూడనంత ఎనర్జిటిక్ పాత్రలో అభిమానులు చూస్తారని సినిమాపై హైప్ మరింత పెంచారు.


Also Read వైష్ణవ్ తేజ్, శ్రీ లీల సినిమాపై వరల్డ్ కప్ ఎఫెక్ట్ - దీపావళి బాక్సాఫీస్ బరిలో నుంచి వెనక్కి వెళ్లిన 'ఆదికేశవ'



తమన్... పూజా హెగ్డే... క్లారిటీ!
'గుంటూరు కారం' నుంచి నుంచి సంగీత దర్శకుడిగా తమన్ బదులు మరొకరిని తీసుకుంటారని, అతడిని తీసేయాలని బలంగా పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే. వాటిపై కూడా నాగవంశీ వివరణ ఇచ్చారు. తమన్ ను తీసేయాలని ఎప్పుడూ అనుకోలేదని, మరోవైపు పూజా హెగ్డే డేట్స్ బాలీవుడ్ సినిమాతో క్లాష్ అవడం వల్లే తప్పుకోవాల్సి వచ్చిందని నాగవంశీ వివరించారు.


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) 'గుంటూరు కారం' ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు.