మూవీ మేకర్స్ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఉండడం సహజమే. ఒక్కొక్కసారి ఈ కాంట్రవర్సీలు అనేవి పూర్తి కెరీర్‌పైన ప్రభావం చూపిస్తాయి. ఎంతోమంది పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు, హీరోహీరోయిన్లు కూడా అలాంటి కాంట్రవర్సీలలో చిక్కుకుని తమ కెరీర్‌ను కష్టంగా మార్చుకున్నారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఇలాంటి ఒక కాంట్రవర్సీలోనే చిక్కుకున్నాడు. తను రైటర్‌గా వ్యవహరించిన ‘బ్రో’ చిత్రం చుట్టూ ఇప్పుడు అనేక రాజకీయ, సినిమా కాంట్రవర్సీలు తిరుగుతున్నాయి. దీంతో త్రివిక్రమ్ తరువాతి ప్రాజెక్ట్స్‌పై ఈ కాంట్రవర్సీల ప్రభావం ఉంటుందని తన ఫ్యాన్స్ ఆందోళనపడుతున్నారు. అంతే కాకుండా రాజకీయపరంగా తనకు ఇబ్బందులు ఎదురవుతాయి అని కూడా భావిస్తున్నారు.


‘బ్రో’ కోసం రంగంలోకి త్రివిక్రమ్


‘వినోదాయ సితం’ అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని దర్శకుడు సముద్రఖని నిర్ణయించుకున్నారు. ఆ కథను పవన్ కళ్యాణ్‌కు వినిపించారు. కథ ఓకే అయ్యి సినిమా సెట్స్‌పైకి కూడా వెళుతుందని నిర్ణయించుకున్న తర్వాత సీన్‌లోకి త్రివిక్రమ్ ఎంటర్ అయ్యారు. కథను తెలుగు ప్రేక్షకులను తగినట్టుగా మార్చాలని నిర్ణయించుకున్నారు. కానీ దాంతో పాటు కథలో మరెన్నో మార్పులు చేశారని సముద్రఖని స్వయంగా బయటపెట్టారు. ఆ మార్పులు తనకు కూడా నచ్చడంతో త్రివిక్రమ్ చెప్పినట్టే చేశానని తెలిపారు. అయితే బ్రో విడుదలయిన తర్వాత త్రివిక్రమ్.. ఈ సినిమాను చాలా యాంగిల్స్‌లో డిసైడ్ చేశాడని ప్రేక్షకులు అనుకోవడం మొదలుపెట్టారు. దీంతో బ్రోపై నడుస్తున్న కాంట్రవర్సీల విషయంలో కూడా త్రివిక్రమ్‌నే ఎక్కువగా నిందిస్తున్నారు.


ప్రస్తుతం ‘బ్రో’ సినిమా చుట్టూ తిరుగుతున్న ప్రతీ కాంట్రవర్సీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌నే స్పాట్‌లైట్‌లో పెడుతోంది. మాటల మాంత్రికుడిగా తన డైలాగులతో మాయ చేయగల క్రియేటర్ ఇప్పుడు రాజకీయ, సినిమా కాంట్రవర్సీలలో చిక్కుకుపోయాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. వైసీపీ పార్టీ నాయకులు త్రివిక్రమ్‌పై ఆగ్రహంతో ఉన్నారు. అంతే కాకుండా అంబటి రాంబాబు సైతం త్రివిక్రమ్ కచ్చితంగా దీనికి పర్యావసనాలు భరించాల్సి ఉంటుందని ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయం కావడంతో పార్టీ ఎక్కువగా దీనికి రియాక్ట్ అవ్వదని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నా కూడా రాజకీయ నాయకుల ఎత్తులు, పైఎత్తులను అంచనా వేయలేమని మరికొందరు అనుకుంటున్నారు.


‘గుంటూరు కారం’ రిజల్ట్‌పై కలవరం


ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేశ్‌తో చేస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జనవరి 2024లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక గుంటూరు కారం సినిమా గురించి ఇప్పటికే ఎన్నో అనుమానాలు సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా పూజా హెగ్డే ఈ సినిమా నుండి హీరోయిన్‌గా తప్పుకుంది. ఆ తర్వాత డీఓపీ, మ్యూజిక్ డైరెక్టర్ కూడా తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. సినిమా షూటింగ్ సగం వరకు పూర్తయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ చుట్టూ కాంట్రవర్సీలు తిరుగుతుండగా.. ‘గుంటూరు కారం’ను మరింత జాగ్రత్తగా తెరకెక్కించాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంతే కాకుండా సినిమా హిట్ అయితే.. వైసీపీ ఫాలోవర్స్ సైలెంట్‌గా ఉంటారు. కానీ కాస్త మిక్స్‌డ్ టాక్ వచ్చినా కచ్చితంగా త్రివిక్రమ్ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మొత్తానికి బ్రో వల్ల త్రివిక్రమ్‌కు రాజకీయ సెగ బాగానే తగులుతున్నట్టు అనిపిస్తోంది.


Also Read: అంబటి రాంబాబు వార్నింగ్‌కు సాయి ధరమ్ తేజ్ కౌంటర్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial