Geethanjali Malli Vachindi Teaser Review In Telugu: టాలీవుడ్ లో ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న కొన్ని చిన్న సినిమాల సీక్వెల్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ లిస్టులో అంజలి లీడ్ రోల్ ప్లే చేసిన 'గీతాంజలి' మూవీ కూడా చేరింది. 2014లో హారర్ అండ్ కామెడీ డ్రామాగా వచ్చిన 'గీతాంజలి' ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమా సీక్వెల్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే టైటిల్ తో ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేశారు.

టీజర్ తో పెరిగిపోయిన అంచనాలు 

'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీలో మరోసారి అంజలి లీడ్ రోల్ ప్లే చేసింది. అంజలి కెరీర్ లో ఇది 50 వ చిత్రం కావడం విశేషం. ఈమెతో పాటు శ్రీనివాస్ రెడ్డి, 'సత్యం' రాజేష్, సునీల్, సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా రిలీజ్ అయిన టీజర్ హారర్ అండ్ కామెడీ అంశాలతో సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక టీజర్ విషయానికొస్తే... అంజలి క్లాసికల్ డాన్స్ చేస్తున్న షాట్ తో టీజర్ మొదలవుతుంది. 'ఎవర్రా వీళ్ళు... సంగీత మహల్ వైపు వెళ్తున్నారు? ఆ మహల్ లోకి తెలిసే వెళ్తున్నారా?' అని ఓ వ్యక్తి అడగగా... 'షూటింగ్ జరుగుతోందట' అంటూ బ్యాగ్రౌండ్ లో డైలాగ్స్ వినిపించాయి. ఆ తర్వాత దర్శకుడిగా శ్రీనివాస్ రెడ్డి సినిమా స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. ఆ సమయంలో అంజలి ఓ ట్విస్ట్ చెబుతుంది. అలా టీజర్ ఒక్కసారిగా హారర్ మోడ్ లోకి వెళుతుంది. దయ్యాల గజ్జల సౌండ్ కు అందరూ భయపడతారు. దయ్యాలకు మహల్ లో ఉన్న ప్రతి ఒక్కరు వణికిపోతారు. సినిమాలో హారర్ తో పాటు కామెడీ కావలసినంత ఉంటుందని టీజర్ లోనే చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా షకలక శంకర్, సత్య ఇద్దరి కామెడీ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టీజర్ చివర్లో దెయ్యంగా మారిన అంజలి విలన్ తో తలపడే షాట్ హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత సత్య ఓ ఆడ దెయ్యంతో చేసే కామెడీ మరో హైలైట్ అనే చెప్పాలి. మొత్తంగా టీజర్ చూస్తే అంజలి గీతాంజలిగా మరోసారి భయపెట్టడం గ్యారెంటీగా కనిపిస్తోంది.

తెలుగుతో పాటూ ఆ భాషల్లోనూ రిలీజ్

ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన హారర్ కామెడీ సినిమాలతో కంపేర్ చేస్తే... ఈ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' భారీ బడ్జెట్ సినిమా అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కోన వెంకట్ తెలిపారు. మార్చ్ 22 న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై విశాఖ ఎంపీ, రాజకీయ నేత ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'నిన్ను కోరి', 'నిశ్శ‌బ్దం' చిత్రాల‌కు  కొరియోగ్రాఫ‌ర్ గా పని చేసిన శివ తుర్ల‌పాటి దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అంజ‌లి, శ్రీనివాస్ రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, సునీల్‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ర‌విశంక‌ర్‌, ప్రియ, ముక్కు అవినాష్‌, విరుపాక్ష ర‌వి, రాహుల్ మాధ‌వ్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి కోన  కోన వెంక‌ట్‌ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు స్వరాలు సమకూరుస్తున్నారు.

Also Read : ‘జవాన్’ను మించి ఉంటుంది - షారుఖ్‌తో మరో మూవీ, అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్