రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్'(Game Changer) మూవీ నుంచి రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ సాంగ్ లీకై ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే. 'జరగండి' అంటూ సాగే ఈ పాట మూవీ టీం రిలీజ్ చేయకముందే ఆన్లైన్లో లీక్ అయింది. అయితే తాజాగా ఈ సాంగ్ ని లీక్ చేసిన ఓ ఇద్దరినీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'గేమ్ చేంజర్' (Game Changer). కంప్లీట్ పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


'RRR' వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో 'గేమ్ చేంజర్'పై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉండబోతుందని మేకర్స్ ముందు నుంచే చెబుతూ వస్తున్నారు. చాలా రోజులుగా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఇటీవల 'గేమ్ ఛేంజర్' నుంచి ఓ పాట లీక్ అయింది. మూవీ టీం అఫీషియల్ గా రిలీజ్ చేయకముందే ఆన్లైన్లో లీకైన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆ సమయంలో సాంగ్ లీక్ అవ్వడం పై దిల్ రాజు సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, తాజాగా ఈ సాంగ్ లీక్ లో భాగమైన ఇద్దరినీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయవద్దని వాళ్ళని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ చాంద్ పాషా, ఎస్సై శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీ ప్రసేన్ రెడ్డి, శ్రీ సాయి తేజ్ బృందం ఈ కేసును ఛేదించారు. సాంగ్ లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వీళ్ళ మీద ఐటీ చట్టంలోని సెక్షన్ 66C, 66R/W కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ లీక్ అయిన సాంగ్ ని మూవీ టీం దీపావళి సందర్భంగా ఫస్ట్ సింగిల్ గా విడుదల చేస్తున్నారు.


ఈ సాంగ్‌ను దీపావళికి చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా సినిమాని రూపొందిస్తున్నారు. ఎందుకంటే దిల్ రాజు నిర్మాణ సంస్థలో వస్తున్న 50వ చిత్రం ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజుతో పాటు శిరీష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది.


కియారా అద్వానీ అంజలి హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఎస్ జె సూర్య, నవీన్ చంద్ర, సునీల్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ముందుగా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ గత కొద్ది నెలలుగా 'గేమ్ చేంజర్' షూటింగ్ వాయిదా పడుతూ వస్తుండడంతో వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీ గురించి మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.


'హీరోలందరూ లైన్ వెయ్యడానికే అప్రోచ్ అవుతారని అనుకునేదాన్ని'


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial