మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టూవర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్​కి 'దొంగాట' ఫేమ్ వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు వంశీ, ఈ సినిమాకు రవితేజ ఫస్ట్ ఛాయిస్ కాదనే విషయాన్ని వెల్లడించారు.


టైగర్‌ నాగేశ్వరరావు సినిమా చేయాలనుకున్నప్పుడు ఎంతోకాలం రీసెర్చ్‌ చేశానని వంశీ తెలిపారు. ఆయన జీవితానికి సంబంధించి ఎక్కడా పుస్తకాలు దొరకలేదని, తెలిసిన వారందరి నుంచి కొన్ని కథలు విన్నానని చెప్పారు. టైగర్‌ స్టోరీని ముందుగా యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్​కు చెప్పినట్లు వెల్లడించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తమ కాంబినేషన్​లో సినిమా మొదలు కాలేదని, ఆ తర్వాతే రవితేజకు ఈ కథను నేరేట్ చేశానని తెలిపారు. 


‘‘టైగర్‌ నాగేశ్వరరావు కథ సాయి శ్రీనివాస్​కు బాగా నచ్చింది. కాకపోతే అప్పటికే ఆయన నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. దానివల్ల సినిమా బాగా ఆలస్యమయ్యేలా కనిపించింది. దీంతో మరో హీరోతో సినిమా చేసుకుంటానని నేను చెప్పడంతో ఆయన దానికి అంగీకరించారు. మా మధ్య మంచి అనుబంధమే ఉంది. కానీ రవితేజతో నేను ఈ మూవీని అనౌన్స్ చేసిన తర్వాత శ్రీనివాస్‌ మరో దర్శకుడితో టైగర్‌ నాగేశ్వరరావు బయోపిక్​ను ప్రకటించాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ సినిమా ఆగిపోయింది’’ అని వంశీ తెలిపారు. 


Also Read: 'నా లైఫ్​లో లేని అనుభవాలను బాలయ్యగారు ఇచ్చారు'


నిజానికి రవితేజతో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తీస్తారని వార్తలు వచ్చిన తర్వాత 2021 ఆగస్టులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా 'స్టూవర్ట్ పురం దొంగ' అనే సినిమా తెరకెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది 1970లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన, ధైర్యవంతుడైన దొంగ ‘టైగర్’ నాగేశ్వరరావు బయోపిక్ అంటూ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్​ను ఆవిష్కరించారు. దీనికి 'బయోపిక్ ఆఫ్ టైగర్' అనే క్యాప్షన్ పెట్టారు. షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని పోస్టర్ ద్వారా తెలియజేశారు.


శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్​పై సాయి శ్రీనివాస్‌ తండ్రి బెల్లంకొండ భారీ బడ్జెట్​తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. వివి వినాయక్ వద్ద వర్క్ చేసిన కెఎస్ 'స్టూవర్ట్ పురం దొంగ' సినిమాతో డైరెక్టర్​గా పరిచయం కావాల్సింది. రచయితలు వెన్నెలకంటి బ్రదర్స్, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ తమ్మిరాజు వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ మూవీలో భాగం అవుతున్నట్లు పేర్కొన్నారు. కానీ ఎందుకనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే ఇన్నాళ్లకు దీని వెనుక బ్యాక్ స్టోరీని దర్శకుడు వంశీ వెల్లడించారు. 


70స్ లో స్టూవర్ట్ పురంలో మోస్ట్ వాంటెడ్ దొంగ 'టైగర్' నాగేశ్వరరావు. పోలీసులు, జైలు నుంచి చాకచక్యంగా తప్పించుకోవడంలో ఆరితేరిన తెలివైన దొంగగా పేరుగాంచాడు. చెన్నై జైలు నుంచి తప్పించుకున్న అతన్ని చివరకు 1987లో పోలీసులు కాల్చి చంపారు. ఇప్పటికీ స్టువర్టు పురంలోని అతని ఇంటి ప్రధాన ద్వారానికి నాగేశ్వరరావు ఫోటో వేలాడుతూ ఉంటుందని అంటారు. ఆయన జీవితంలోని సంఘటనలతో, ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాని తెరకెక్కిస్తున్నారు. 


'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్, జిషు సేన్‌ గుప్తా, మురళీ శర్మ, నాజర్, హరీష్ పేరడీ, సుదేవ్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్​పై అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.


Also Read: రిలీజైన రెండు వారాలకే OTTకి వచ్చేస్తున్న సూపర్ స్టార్ అల్లుడి సినిమా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial