ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఆర్జీవి (Ram Gopal Varma)ని వరుస కష్టాలు చుట్టుముడుతున్నాయి. వివాదాలు ఆయనకు కొత్త కాకపోయినా ఏకంగా జైలు శిక్షలు వరకు ఈసారి కేసులు వెళుతున్నాయి. తాజాగా ముంబై కోర్ట్ చెక్ బౌన్స్ కేసులో రాం గోపాల్ వర్మకు మూడు నెలలు జైలు శిక్ష విధించింది. దానితో పాటే మూడు నెలల్లో 3.72 లక్షల పరిహారాన్ని కూడా ఫిర్యాదు దారుకు చెల్లించాలని లేకుంటే మరొక మూడు నెలలు అదనంగా జైల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది.
అసలు కేస్ ఏమిటి?ముంబైలోని 'శ్రీ' అనే సంస్థకు 2018లో రాం గోపాల్ వర్మ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆ సంస్థకు చెందిన 'మహేష్ చంద్ర' ఫిర్యాదు చేశారు. దీనిపై ఏడేళ్లుగా వాదనలు జరుగుతున్నా ఒక్కసారి కూడా రాం గోపాల్ వర్మ కోర్టుకు హాజరు కాలేదు. దీనిపై ఆగ్రహించిన అంథేరీలోని మేజిస్ట్రేట్ కోర్టు ఇప్పటికే ఆర్జీవికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దానితో పాటే మూడు నెలల జైలు శిక్ష విధించడంతో ఆర్జీవి ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఏపీలోనూ పలు కేసులుఇటు ఏపీలోనూ ఆర్జీవి కేసులు ఎదుర్కొంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన చేసిన "వ్యూహం " సినిమాకు సంబంధించి అవకతవకలు జరిగాయని ఫైబర్ నెట్ లో ఆ సినిమాను ప్రదర్శించినందుకు పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారింది అనేది ఒక అభియోగం. అలాగే అప్పటి వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు అనేది టీడీపీ నేతలు చేస్తున్న మరో ఆరోపణ. దీనిపై ఆయన కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు.
నేను మారిపోయాను నమ్మండి: RGV'సత్య' సినిమా మరోసారి చూసిన తర్వాత తాను మారిపోయానని అలాంటి గొప్ప సినిమాలు తీసిన తాను సక్సెస్ అనే మత్తులో మునిగిపోయి తర్వాత చాలా చెత్త సినిమాలు తీశానని RGV రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇకపై అన్ని మంచి సినిమాలే తీస్తానని అందులో భాగంగా తర్వాత తాను తీయబోయే సినిమా పేరు "సిండికేట్" అని కూడా ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్జీవి తలుచుకుంటే ఇప్పటికీ మంచి సినిమా తీయగలరని కొందరు అంటుంటే ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అనీ మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.ఇటు కేసులు అటు వివాదాల నేపథ్యంలో ఒకప్పటి గ్రేడ్ డైరెక్టర్ RGV అలియాస్ రామ్ గోపాల్ వర్మ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: పాపం రష్మిక... కుంటి కాలుతో ఎయిర్ పోర్టులో ఎన్ని కష్టాలు పడిందో ఈ ఫోటోల్లో చూడండి