Dipika Chiklia: బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడి పాత్రలో స్టార్ హీరో ప్రభాస్ నటిస్తుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. కార్యక్రమం తర్వాత మూవీ టీమ్ శ్రీవారిని దర్శించుకుంది. దర్శన అనంతరం ఆలయం వెలుపల దర్శకుడు ఓమ్ రౌత్ బయలుదేరడానికి ముందు హీరోయిన్ కృతి సనన్ ను ఆలింగనం చేసుకొని ఆమె చెంప పై ముద్దు పెట్టాడు. దీంతో ఈ సినిమా దర్శకుడుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. పవిత్రమైన శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఓమ్ రౌత్ అలా చేయడం క్షమించరాని నేరం అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై విపరీతంగా చర్చలు సాగుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో ఈ ఘటన పై గతంలో హిందీ టీవీ చానల్ లో ‘రామాయణం’ సీరియల్ లో సీతగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న దీపికా చిఖ్లియా స్పందించారు.


నేటితరం తారలు వారి పాత్రలతో కనెక్ట్ కాలేకపోతున్నారు: దీపికా చిఖ్లియా


తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో దర్శకుడు ఓమ్ రౌత్ కృతి సనన్ ను కిస్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది దీపికా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ విషయం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాలంలో నటీనటులలో తాము చేసే పాత్రలపై పూర్తి అవగాహన ఉండటం లేదని అన్నారు. ఇదే ఇప్పటితరం తారలలో వచ్చిన సమస్య అని పేర్కొన్నారు. వాళ్లు తమ పాత్రల్లోకి పూర్తిగా ప్రవేశించలేరని, కనీసం ఆ పాత్రను అర్థం చేసుకోవడం లేదని విమర్శించారు. వాళ్లకి రామాయణం అనేది కేవలం ఓ సినిమాలానే కనిపిస్తోందని, దానితో వారు ఆధ్యాత్మికంగా కనెక్ట్ కాలేకపోతున్నారని తెలిపారు.  


మా కాలంలో అలా ఉండేది కాదు..


తాను కూడా సీత పాత్రలో నటించానని చెప్పింది దీపికా. నేటి తరం ఇలాంటి కథల్ని ఒక ప్రాజెక్టుగానే చూస్తారని, సినిమా అయిపోయిన తర్వత మర్చిపోతారని  వ్యాఖ్యానించారు. కానీ తమ కాలంలో అలా ఉండేది కాదని గుర్తు చేసుకున్నారు. తాను సీరియల్ లో సీతగా చేసిన సమయంలో సెట్ లో కనీసం తమను పేరు పెట్టి పిలవడానికి కూడా ఆలోచించేవారని పేర్కొన్నారు. సీత పాత్రలో ఉన్నపుడు అందరూ గౌరవంగా చూసేవారని, కొంత మంది అయితే పాదాలకు నమస్కారం చేసేవారని.. ఆనాటి పరిస్థితుల్ని తలుచుకుంది దీపికా. సెట్ లో ఎప్పుడూ తమను నటులుగా చూసే వారు కాదని, దేవుళ్లుగా చూసేవాళ్లని తెలిపారు. తాము ఎవర్ని ఇలా ఆలింగనం చేసుకోవడం, ముద్దులు పెట్టుకోలేదని తెలిపారు. ప్రేక్షకులు లేదా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తాము ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పారు. ఇప్పుడు ‘ఆదిపురుష్’ సినిమా తర్వాత నటీనటులు ఈ సినిమా గురించి మర్చిపోతారని, వేరే ప్రాజెక్టులు చూసుకుంటారని.. కానీ తమ కాలంలో అలా ఉండేది కాదని పేర్కొన్నారు. ఆ రోజులే చాలా వేరని.. ఇప్పుడా పరిస్థితి లేదని అభిప్రాయపడ్డారు. ఇక ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరి ఇన్ని వివాదాల మధ్య ఈ మూవీకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి. 


Also Read: హీరో, హీరోయిన్లను కొట్టడం పై తేజకి ప్రశ్న - దర్శకుడి ఆన్సర్‌కి పారిపోయిన ‘జబర్దస్త్’ కమెడియన్!