పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మొదటిసారి కలిసిన చిత్రం' బ్రో '(BRO)జూలై 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమర్షియల్ అంశాలను కలగలిపి బలమైన సామాజిక సందేశంతో కూడిన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తమిళంలో వచ్చిన 'వినోదయ సీతం' అనే సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న సామాజిక అంశాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుంటూనే పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్టుగా కమర్షియల్ అంశాలు జోడించి ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని అందించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ఈ సినిమాకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


'బ్రో' మూవీ సుమారు రూ.100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.98 కోట్ల వరకు జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం నైజాం ఏరియాలోనే సుమారు రూ.30 కోట్లకు 'బ్రో' మూవీ థియేటర్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. అలాగే సీడెడ్ రూ.14 కోట్లు ఓవర్సీస్ రూ.12 కోట్ల వరకు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 'బ్రో' మూవీ కి సుమారు రూ.81 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా థియేటర్ ద్వారా రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తేనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లాభాల బాట పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా రూ.100 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇమేజ్, క్రేజ్ ఎంతవరకు యూజ్ అవుతాయి అనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది.


ఈ సినిమాని స్పెషల్ ప్రీమియర్స్, టికెట్ల రేట్ల పెంపు లేకుండానే నిర్మాతలు విడుదల చేశారు. నిజానికి టికెట్ రేట్స్ పెంపు వల్ల సినిమాకి భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అవేవీ లేకుండా 'బ్రో' మూవీ రిలీజ్ అవ్వడంతో ఫస్ట్ డే గ్రాస్, షేర్స్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. 'బ్రో' మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1600 థియేటర్లలో విడుదలైంది. మరోవైపు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రభావం కూడా 'బ్రో' మూవీ ఓపెనింగ్స్ పై పడే అవకాశం ఉంది. మొదటి రోజు ఈ సినిమా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ ని రూ.20 కోట్లకు పైగా షేర్ ని అందుకునే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఊహించిన విధంగా 'బ్రో' రిలీజ్ రోజు వర్ష ప్రభావం ఉండడంతో ఫస్ట్ డే కలెక్షన్స్ లో కొంత తగ్గుదల ఉంటుందని చెబుతున్నారు.


పవన్ కళ్యాణ్ కి నైజాం ఏరియాలో బాగా పట్టుంది. ఆయన గత సినిమాలు 'భీమ్లా నాయక్' (మొదటి రోజు రూ.13 కోట్లు) వకీల్ సాబ్ (మొదటి రోజు తొమ్మిదిన్నర కోట్లు)  రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయి. అయితే ఈసారి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తో పాటు నైజాం ఏరియాలోని పలు ప్రధాన నగరాల్లో భారీ వర్షం ఉండడంతో అది 'బ్రో' మూవీకి మైనస్ గా మారింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో 'బ్రో' మూవీ రూ.100 కోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుందా? లేదా అనేది చూడాలి. కాగా జీ స్టూడియో సంస్థతో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు.


Also Read : ధనుష్‌తో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా ప్రాజెక్ట్ - ఆసక్తి రేపుతున్న కాన్సెప్ట్ పోస్టర్!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial