Dhanush's Jabilamma Neeku Antha Kopama Trailer Released: సినీ పరిశ్రమలో హీరో ధనుష్‌ది ఓ ప్రత్యేక స్థానం. అటు, కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో విలక్షణ కథానాయకుడిగా ఆయన స్టార్ డమ్ వేరే లెవల్. హీరోగానే కాకుండా నిర్మాత, డైరెక్టర్‌గానూ ధనుష్ (Dhanush) తన ప్రత్యేకతను చాటుకుంటారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'జాబిలమ్మ నీకు అంత కోపమా' (Jabilamma Neeku Antha Kopama). పవీష్, అనిఖ సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమాను రిలీజ్ చేయనున్నారు. తాజాగా, మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. 'జాలీగా రండి.. జాలీగా వెళ్లండి' అంటూ ధనుష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్నట్లు తెలుస్తోంది.



కాగా, ధనుష్ డైరెక్షన్‌లో ఆర్.కె.ప్రొడక్షన్‌తో కలిసి ఆయన సొంత నిర్మాణ సంస్థ వండర్ బాల్ ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 2018లో విడుదలైన 'మారి 2' తర్వాత రొమాంటిక్ కామెడీ కథను ధనుష్ తీయడం విశేషం. 'నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం' తమిళ సినిమాను తెలుగులో 'జాబిలమ్మ నీకు అంత కోపమా'గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్ఎల్‌పీ విడుదల చేస్తోంది. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన రాయన్ సినిమాను కూడా ఇదే బ్యానర్ తెలుగులో రిలీజ్ చేసింది.


'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమాకు సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. అటు, ఇటీవల ఈ సినిమా తమిళ వెర్షన్‌లో విడుదలైన 'గోల్డెన్ స్పారో' పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. తెలుగులోనూ ఈ పాటను రిలీజ్ చేశారు.



Also Read: 'తండేల్' డౌన్ లోడ్ చేసి చూస్తున్నారా? - అయితే.. జర జాగ్రత్త, అలాంటి వారికి నిర్మాత బన్నీ వాసు స్ట్రాంగ్ వార్నింగ్


వరుస చిత్రాలతో ధనుష్ బిజీ


2017లో విడుదలైన 'పా పాండి'తో ధనుష్ దర్శకుడిగా తొలి అడుగు వేశారు. ఆయన దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'రాయన్' గతేడాదిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మరోవైపు, ధనుష్ ప్రస్తుతం 'కుబేర', 'ఇడ్లీ కడై'తో పాటు ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఇడ్లీ కడై నుంచి కొన్ని లుక్స్ రివీల్ చేయగా.. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అటు.. 'కుబేర' సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండగా నాగార్జున, రష్మిక మందన్న తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్ హిందీ మూవీ 'తేరే ఇష్క్ మే' అనే టైటిల్‌తో రూపొందుతున్న మూవీకి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ మూవీలో ధనుష్‌తో కృతి సనన్ నటిస్తున్నారు.


మరోవైపు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌లోనూ ధనుష్ నటిస్తున్నారు. ఈ మూవీ ప్రకటించి దాదాపు ఏడాది గడుస్తున్నా.. ఇప్పటివరకూ ఒక్క అప్ డేట్ కూడా రాకపోవడంతో సినిమా ఆగిపోయిందనే రూమర్స్ హల్చల్ చేశాయి. అయితే, ఈ సినిమా ఇంకా ట్రాక్‌లోనే ఉందని.. అప్పటికే కమిట్ అయిన నిర్మాతలు మరో కొత్త నిర్మాణ సంస్థతో కలిసి పని చేయబోతున్నారని తెలుస్తోంది. ఇళయరాజా బయోపిక్ ను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. ఈ బ్యానర్‌తో ఇప్పుడు మరో నిర్మాణ సంస్థ కూడా చేతులు కలిపినట్టు సమాచారం.


Also Read: 'లైలా' సినిమా బాయ్ కాట్ చేయండి - 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్‌పై వైసీపీ ఫ్యాన్స్ ఫైర్, సినిమాను పొలిటికల్ వివాదం చుట్టుముట్టిందా?