యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. నిఖిల్ నటించిన 'కార్తికేయ 2' భారీ విజయం సాధించడంతో పాటు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చి పెట్టింది. దాంతో నిఖిల్ ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. 'కార్తికేయ 2', '18 పెజేస్ వంటి హిట్స్ తర్వాత నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'స్పై'(Spy). ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్ ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ కి అనూహ స్పందన లభించింది. ముఖ్యంగా రీసెంట్‌గా రిలీజైన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. జూన్ 29న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.


అదేంటంటే ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. చిత్ర యూనిట్ ఈ సినిమాలో దగ్గుబాటి రానా ను గెస్ట్ రోల్ కి కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రానా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారట. ఇక సినిమాలో రానా పాత్ర సెకండ్ హాఫ్ లో వస్తుందని, రానా ఎంట్రీ సీన్ కూడా ఎలివేషన్స్ తో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా నిఖిల్ కి రానాకి మధ్య కొన్ని సన్నివేశాలు కూడా ఉంటాయట. సెకండాఫ్ లో వచ్చే ఒక  పెద్ద ఎపిసోడ్ లో రానా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. రీసెంట్ గా షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమాలో సల్మాన్ ఖాన్ ఎలా కనిపించారో అలా నిఖిల్ 'స్పై' మూవీ లో రానా కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారుతుంది. మరి ఇదే కనక నిజమైతే రానా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ సీక్రెట్ స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు.


ఇక అతని సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి, చరణ్ ఉప్పలపాటి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్యన్ రాజేష్,  మకరంద్ దేశ్ పాండే, జిస్సు సేన్ గుప్తా, సాన్యా ఠాకూర్ అభినవ గోమాటం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్, శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా జూన్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ని ఈనెల 22న మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక స్పై తర్వాత నిఖిల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా ఓ భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'ద ఇండియా హౌస్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్, రామ్ చరణ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉండడం విశేషం.


Read Also: ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన స్టార్ కిడ్స్ - షారుఖ్‌, అమితాబ్, శ్రీదేవి వారసులు ఇరగదీశారంతే!