Latest Update On Ravi Teja’s Mr. Bachchan Movie : టాలీవుడ్ కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ఆదివారమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. లాంగ్ గ్యాప్ తర్వాత హరీష్ శంకర్ - రవితేజ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'షాక్' నిరాశపరచగా ఆ తర్వాత రిలీజ్ అయిన 'మిరపకాయ్' భారీ సక్సెస్ అందుకుంది. మళ్లీ 13 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.


అదేంటంటే, ఈ మూవీని హరిష్ శంకర్ హిందీలో అజయ్ దేవగన్ నటించిన 'రైడ్' సినిమా ఆధారంగా తెరకెక్కించబోతున్నారట. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ రైడ్ సినిమాను తీశారు. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్ పై దాదాపు మూడు రోజులపాటు జరిపిన ఇన్ కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పుడు ఇదే సినిమాని ఆధారంగా చేసుకుని మిస్టర్ బచ్చన్ మూవీని తన స్టైల్ లో రవితేజ ఇమేజ్ కి తగినట్లుగా కమర్షియల్ అంశాలను కలిపి హరీష్ శంకర్ రీమేక్ చేయబోతున్నారట. హరీష్ శంకర్ రీమేక్ చేశాడంటే అది ఒరిజినల్ కన్నా బాగుంటుందని చెప్పడంలో డౌటే లేదు.


గతంలో చూసుకున్నట్లయితే సల్మాన్ ఖాన్ 'దబాంగ్' సినిమాని 'గబ్బర్ సింగ్' గా రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ మూవీ పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు సినీ లవర్స్ అందరిని ఎంతగానో ఆకట్టుకొని ఒరిజినల్ వెర్షన్ కన్నా అనూహ్య రెస్పాన్స్ అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన 'జిగర్తాండ' సినిమాను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి 'గద్దల కొండ గణేష్' పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు రవితేజతో తీస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ కూడా 'రైడ్' మూవీకి రీమేక్ అనే విషయం బయటకు రావడంతో పక్కాగా ఈ మూవీ కూడా ఒరిజినల్ కంటే బెటర్ గా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


టైటిల్ తోనే తన మార్పులు మొదలెట్టిన హరీష్ శంకర్ ఈ మూవీతో మరోసారి రిమేక్ కింగ్ అనిపించుకోవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. కాగా హరిష్ శంకర్ ఈ సినిమాని వీలైనంత తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది పనోరమా స్టూడియోస్, టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : ‘సలార్’ రిలీజ్ ట్రైలర్ - ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా!