Padmavibhushan Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమయ్య, డాక్టర్‌ ఆనందచారి వేలుకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా సమయ్య, ఆనందచారిలకు చిరంజీవి ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. ఇంటికి ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించారు. వారికి శాలువా కప్పి, బోకే అందించి వారితో కాసేపు ముచ్చటించారు.

  


ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపానికి జీవం పోసినందుకు గడ్డం సమ్మయ్య గారికి పద్మశ్రీ పురస్కారం రావడం చాలా ఆనందకరం అని అన్నారు. ఇటువంటి కళారూపాలను, కళాకారులను గుర్తించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన కళలతో పాటు కళాకారులను కాపాడుకోవాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు చిరు.


శిల్పకళలో వినూత్న సేవలు అందించిన ఆనందచారి వేలుకు కూడా  శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి ఆలయం పునర్నిర్మాణంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. కృష్ణశిలతో అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు చిరంజీవి. చిరంజీవి లాంటివారు తమను ఇంటికి ఆహ్వానించడం, తమని సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నామని, తమను సత్కరించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని సమ్మయ్య, వేలు సంతోషం వ్యక్తంచేశారు.


యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య.. 


జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య. 50 ఏళ్లుగా ఆయన ఈ కళనే నమ్ముకుని బతుకుతున్నారు. 19వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 1985లో నిర్వహించిన ‘కీచకవధ’ ప్రదర్శనలో కీచకుడి పాత్రలో గుర్తింపు తెచ్చుకున్నారు సమ్మయ్య. 1994లో తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభ పురస్కారం, 1995లో తెలుగు విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో గవర్నర్ చేతుల మీదుగా కళారత్న పురస్కారం అందుకున్నారు. 2017లో తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది.


యాదాద్రి పునర్నిర్మాణంలో కీలకం ఆనందచారి


యాదాద్రి ఆలయం పునర్నిర్మాణం సంపూర్ణంగా కృష్ణశిలతో జరిగింది. దానికి మూలకారణం.. డాక్టర్‌ ఆనందచారి వేలు. ప్రధాన స్థపతి హోదాలో ఆయన రాతి శిల్ప రూపకర్తగా అహర్నిశలు కృషి చేశారు. అష్టభుజి మండప ప్రాకారాలు కాకతీయ, ద్రవిడ, చోళ శిల్పకళా రీతిలో తీర్చిదిద్దేందుకు ఎంతో కష్టపడ్డారు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శిల్ప కళాశాలలో తొలిదశలో శిక్షణ పొంది, ప్రప్రథమంగా ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లోని దేవాదాయ శాఖకు చెందిన స్థపతి హోదాలో పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.


Also Read: 'హనుమాన్‌' మూవీ ఎఫెక్ట్ - పూనకంతో ఊగిపోయిన మహిళ