బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్పై సల్మాన్ నిర్మించిన ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహించాడు. ఈద్ స్పెషల్ గా ఏప్రిల్ 21న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల 'బతుకమ్మ', 'ఏంటమ్మా' అనే పాటలను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్స్ విషయంలో ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

 

'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' అనేది తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'వీరం' చిత్రానికి రీమేక్ (తెలుగులో 'కాటమ రాయుడు') అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది పక్కన పెడితే, సల్మాన్ సినిమాలో కథ ప్రకారం సౌత్ అప్పీల్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగానే సినిమాలో తెలంగాణ పండుగ బతుకమ్మ బ్యాక్ డ్రాప్ లో పాటను పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ సాంగ్ సెటప్ అంతా తెలంగాణ ప్రాంతంలా కాకుండా, తమిళ సంస్కృతికి దగ్గరగా ఉన్నట్లు సెట్ చేశారు. ఇందులో వెంకీ, భూమిక, పూజలు తమిళుల గెటప్ లో అడ్డబొట్టులతో కనిపించడంపై నెటిజన్లు ట్రోల్ చేశారు.

 

ఇదే క్రమంలో ఈ మధ్య 'ఏంటమ్మా' అనే మరో సాంగ్ ను లాంచ్ చేశారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తళుక్కున మెరిశారు. సల్మాన్, వెంకటేష్ లతో కలిసి చెర్రీ డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు, హిందీ సాహిత్యాల కలబోతగా సాగే ఈ పాటలో, ముగ్గురు హీరోలు ఒకే రకమైన దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపించారు. ఇది అభిమానులకు కనుల పండుగగా ఉంది కానీ.. 'లుంగీ డ్యాన్స్' అని చెప్పి ఎవరూ లుంగీ కట్టుకోకపోవడమే విడ్డూరంగా అనిపించింది.

 

గతంలో 'చెన్నై ఎక్స్ ప్రెస్' సినిమాలో షారూక్ ఖాన్ లుంగీ డాన్స్ చేస్తే, ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా అదే లుంగీని ప్రస్తావిస్తూ డాన్స్ చేశారు. కాకపొతే ఈ రెండు పాటల్లోనూ వారు లుంగీలు కట్టుకోలేదు.. ధోతీలు ధరించారు. సౌత్ కల్చర్ ని ప్రతిభింబించేవే అయినా.. లుంగీ, ధోతీ అనేవి రెండూ వేర్వేరు దుస్తులు. లుంగీ చెక్ ప్యాటర్న్ తో కూడిన కలర్ ఫుల్ క్యాజువల్ డ్రెస్. తెలుగు వాళ్ళు సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడు సౌకర్యంగా ఉంటుందని లుంగీలు ధరిస్తారు. అయితే ధోతీ లేదా పంచె అనేది బంగారం రంగు అంచులతో కూడి ఉంటుంది. ఇక్కడ 'ఏంటమ్మా' సాంగ్ లో హీరోలు ముగ్గురూ ధోతీల్లో కనిపించారు కానీ.. లుంగీల్లో కాదు.

 

సల్మాన్ ఖాన్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ టీమ్ ఈ విషయాన్ని పట్టించుకోనప్పటికీ.. సౌత్ స్టార్స్ రామ్ చరణ్, వెంకటేష్ మధ్య తేడా తెలుస్తుంది. ఇక్కడ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా తెలుగు వ్యక్తి. అయినప్పటికీ, వారు ఈ స్పష్టమైన తప్పును పట్టించుకోలేదు. అది లుంగీనే అని ఫిక్స్ అయిపోయారు. హీరోయిన్ పూజా హెగ్డే సైతం లుంగీ డ్యాన్స్ హైలైట్ గా నిలుస్తుందని.. ఇకపై ప్రతీ పెళ్ళిలో పార్టీలలో ఇదే పాట మోగుతుందని చెప్పింది. విక్టరీ వెంకటేష్ కూడా తెలుగు వ్యక్తే.. కనీసం ఆయనైనా ఆ తేడాను చెప్పి ఉంటే బాగుండేదని అభిమానులు అంటున్నారు.

 


 

సౌత్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ సినిమాలు సెట్ చేయడం తప్పు కాదు.. కానీ, దాని కోసం కొంత పరిశోధన చేయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గౌరవించకుండా.. అడ్డబొట్టు, తమిళ మలయాళీ కల్చర్ అన్నీ కలగలిపేసి ఖూనీ చేయడం సరికాదని కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఇకనైనా మేల్కోవాలని సౌత్ జనాలు సూచిస్తున్నారు.