Prasanth Varma about Jai Hanuman: ‘హనుమాన్’లాంటి విజువల్ రిచ్ ఫిల్మ్‌ను తెరకెక్కించి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా తను తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలు అందుకుంటోంది. సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదలయినా కూడా ప్రేక్షకులు ఇప్పటికీ ‘హనుమాన్’నే ఎక్కువగా చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇక ‘హనుమాన్’ హిట్ అవ్వడంతో తన తరువాతి ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’ పనులను మొదలుపెట్టాడు ప్రశాంత్ వర్మ. ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించాడు. తాజాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో మెరవనున్నట్టు బయటపెట్టాడు.


ప్రీ ప్రొడక్షన్ మొదలు..


‘హనుమాన్’ సినిమాను లిమిటెడ్ బడ్జెట్‌లో తెరకెక్కించినా కూడా ఈ మూవీ విజువల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దీనికి క్రెడిట్ అంతా దర్శకుడు ప్రశాంత్ వర్మకే ఇస్తున్నారు. అందుకే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ను మరింత కాన్ఫిడెన్స్‌తో తెరకెక్కించడానికి సిద్ధపడ్డాడు ఈ దర్శకుడు. ఇప్పటికే భారీ ఎత్తులో ‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ‘హనుమాన్’ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం ఏ నటుడిని తీసుకోకుండా సీజీతో దేవుడిని తయారు చేసి ప్రేక్షకులకు చూపించాడు ప్రశాంత్ వర్మ. కానీ ‘జై హనుమాన్’లో మాత్రం ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడిని హనుమంతుడిగా చూపించడానికి సిద్ధమవుతున్నట్టు తాజాగా రివీల్ చేశాడు.


పాత్రకు న్యాయం చేయాలి..


తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ‘జై హనుమాన్’ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ. హనుమంతుడి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ హీరో నటించే అవకాశం ఉందని అన్నాడు. మేకప్, లుక్ టెస్ట్ అన్నీ పూర్తయిన తర్వాతే ఈ పాత్రకు తగిన హీరోను సెలక్ట్ చేసుకుంటామని తెలిపాడు. ఆ హీరో పాత్రకు న్యాయం చేస్తాడని అనిపించాలని చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని బయటపెట్టాడు. త్వరలోనే ‘జై హనుమాన్’కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెడతానని చెప్పుకొచ్చాడు. ఇక ‘జై హనుమాన్’లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నటీనటులు చాలామంది భాగం కానున్నారని రివీల్ చేశాడు.


ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు..


ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ‘హనుమాన్’ మూవీ హిందీ మార్కెట్‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో ప్రశాంత్ గురించి బాలీవుడ్ నటీనటులకు కూడా ఒక ఐడియా వచ్చే ఉంటుంది. అందుకే తన దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు కూడా వెనకాడే అవకాశాలు లేవు అని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ‘హనుమాన్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు కలెక్షన్స్‌ను సాధించింది. ఈ మూవీలో తేజ సజ్జాతో జోడీగా అమృత అయ్యర్ నటించింది. మరో హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఇతర కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ‘అధీర’ అనే మూవీతో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ కంటే ‘అధీర’ భారీ ఎత్తులో ఉండబోతుందని చెప్పాడు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు ఫిదా అయిపోయిన ఆడియన్స్ తన తరువాతి ప్రాజెక్ట్స్‌ గురించి ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు.


Also Read: అందుకే ఆ బంధాన్ని ముగించేశాను, అవన్నీ గుర్తొస్తే కన్నీళ్లొస్తాయి - విడాకులపై నిహారిక కామెంట్స్