Biriyaani Movie explanation in Telugu: కొన్ని పరిస్థితులు మనుషుల జీవితాలను ఊహించని మలుపు తిప్పుతాయి. కొంత మంది కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటే.. మరికొంత మంది జీవితాలు సమస్యల సుడిగుండంలో చిక్కి కొట్టుమిట్టాడుతాయి. ఓ ముస్లీం మహిళ తన జీవితంలో ఎలాంటి దుస్థితిని ఎదుర్కొన్నది? చివరకు పరిస్థితులు ఆమె బిడ్డతో పాటు తన చావుకు ఎలా కారణం అయ్యింది? అనేది ఈ చిత్రంలో అత్యంత హృద్యంగా తెరకెక్కించారు దర్శకుడు సజిన్ బాబు. కని కస్రుతి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 2020లో విడుదల అయ్యింది. 95 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా చక్కటి ఆదరణ దక్కించుకుంది. ఏకంగా 13 ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. సినిమా బాగున్నప్పటికీ, కొన్ని సన్నివేశాలను అందరూ కలిసి చూడలేరు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ జారీ చేసింది.


సినిమా కథ ఏంటంటే?


ఖదీజా(కని కస్రుతి) ఓ చేపలు పట్టుకునే కుటుంబానికి చెందిన పేద మహిళ. భర్త, కొడుకు, అత్తతో కలిసి ఉంటుంది. ఆమెను భర్త సరిగా పట్టించుకోడు. కనీస అవసరాలు కూడా తీర్చడు. కేవలం ఇంట్లో పని చేయడానికి మాత్రమే ఉంది అన్నట్లు వ్యవహరిస్తాడు. ఖదీజా అత్త కూడా ఆమెను వేధిస్తూ ఉంటుంది. అప్పుడే ఖదీజా అమ్మ ఆరోగ్యం బాగాలేదని తెలుస్తుంది. వెంటనే భర్తతో కలిసి అమ్మవాళ్ల ఇంటికి వెళ్తుంది. తన తండ్రి చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లి చనిపోతాడు. అప్పటి నుంచి తల్లి మానసిక పరిస్థితి సరిగా ఉండదు. తమ్ముడు చక్కగా చదువుకుని అరబ్ కంట్రీలో ఇంజినీర్ గా పని చేస్తాడు. ఆ తర్వాత ఇండియాకు వస్తాడు. ఉద్యోగం మానేస్తాడు. కొంతకాలం నుంచి ఎవరికీ కనిపించకుండా పోతాడు.


తండ్రి చనిపోయి ఏడాది దగ్గర పడటంతో వర్థంతిని ఘనంగా చేయాలని, ఊళ్లో వాళ్లందరినీ పిలిచి బిర్యానీ పెట్టాలని తల్లి కూతురికి చెప్తుంది. తమ్ముడు కూడా ఇదే మాట అనేవాడని, కొంత కాలంగా కనిపించడం లేదని చెప్తుంది. తమ్ముడు వస్తాడు అమ్మా.. నువ్వు చెప్పినట్లే నాన్న వర్థంతి ఘనంగా చేద్దామని ఖదీజా చెప్తుంది. తండ్రి చేపల వేటకు వెళ్లి చనిపోయాడు కాబట్టి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే సాయం అందుతుందని పొరుగు మహిళ చెప్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బిర్యానీ పెట్టలేమని, కేవలం పిండి వంటలతో వర్థంతి చేద్దామని చెప్తుంది ఖదీజా. పిండి వంటలు చేసి మసీదుకు తీసుకెళ్లి అందరికీ పెడుతుంది. మళ్లీసారి అయినా, బిర్యానీ పెట్టాలని మసీదు పెద్దలు చెప్తారు.


ఆ తర్వాత ఆమె అత్తగారింటికి వస్తుంది. అదే సమయంలో ఖదీజా తమ్ముడు ఐఎస్ఐఎస్ లో చేరాడని, కుటుంబ సభ్యులను విచారించాలని ఎన్ఐఏ అధికారులు ఇంటికి వచ్చి చెప్తారు. ఖదీజాతో పాటు ఆమె తల్లిని స్టేషన్ కు తీసుకెళ్తారు. తన తమ్ముడి గురించి ఆరా తీస్తారు. గత కొద్ది రోజులు ఆమె తమ్ముడు ఎవరెవరితో తిరిగేవాడో చెప్పమంటారు. అప్పుడు, ఉద్యోగం కోసం అబూబాకర్ అనే వ్యక్తిని తరచుగా కలిసే వాడని చెప్పారు. పోలీసులు ఖదీజాను స్టేషన్ కు తీసుకెళ్లడంతో మత పెద్దలు వారిని వెలివేస్తారు. తన భర్త కూడా ఫోన్ ద్వారా తలాక్ చెప్తాడు. తన కొడుకును కూడా ఆమెను కలవకుండా చేస్తాడు. మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. వారి తండ్రి మరణానికి అందే సాయం కూడా అందంకుండా గ్రాస్తులు అడ్డుకుంటారు.


ఇక్కడ ఉండటం మంచిది కాదని తన తమ్ముడి ఫ్రెండ్ అబూబకర్ వారిని కలిసి చెప్తాడు. తమిళనాడులో తనకు తెలిసిన ఓ మసీదు దగ్గర ఉండాలని, ఇప్పుడు ఇక్కడ ఉండటం మంచిది కాదంటాడు. ఆయన మాట ప్రకారం, తమిళనాడుకు వెళ్తారు. అక్కడ ఓ మసీదు దగ్గర ఉంటారు. అక్కడ మసీదు పూజారి బిజిల్(సుర్జిత్) కలుస్తారు. అవసరాల కోసం డబ్బు సంపాదించేందుకు వ్యభిచారం చేస్తుంది. అదే సమయంలో భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో ఖదీజా తమ్ముడు చనిపోతాడు. అయినా, ఈ విషయాన్ని తన తల్లికి చెప్పదు. కొద్ది రోజుల తర్వాత ఆమెకు కూడా తెలుస్తుంది. నెమ్మదిగా ఆరోగ్యం క్షీణించి తను కూడా చనిపోతుంది.


వ్యభిచారం చేయడం వల్ల ఖదీజా గర్భం దాల్చుతుంది. ఒంటరిగా ఉన్న ఖదీజా తన బిడ్డ కోసమైనా బతకాలి అనుకుంటుంది. కానీ, పోలీసులు విచారణ పేరుతో ఆమె పట్ల దారుణంగా వ్యవహరించడంతో బ్లీడింగ్ అవుతుంది. ఆమెను హాస్పిటల్ లో చేర్చుతారు. బిడ్డ చనిపోయినట్లు డాక్టర్లు చెప్తారు. చనిపోయిన పిండాన్ని ఆమెకు ఇస్తారు. బిజిల్ సాయంతో తన దగ్గర ఉన్న డబ్బుతో తన తండ్రి, తల్లి, తమ్ముడి జ్ఞాపకార్థంగా ఇఫ్తార్ పార్టీ ఇవ్వాలని భావిస్తుంది. అందరికీ ఇఫ్తార్ పార్టీ ఆహ్వానాలు పంచుతుంది.


అందరి కోసం బిర్యానీ వండుతుంది. ఆ సమయంలో చనిపోయిన పిండాన్ని బిర్యానీలో వేసి వండుతుంది. దాన్ని ఊళ్లో వాళ్లంతా తింటారు. బిజిల్ ను మాత్రం తినకూడదని ఖదీజా చెప్తుంది. తన బిడ్డ చావుకు కారణమైన వాళ్లకు అదే పిండడాన్ని బిర్యానీగా చేసి పెట్టానని చెప్తుంది. బిజిల్ బాధపడతాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆమె కూడా నీళ్లలోకి దూకి చనిపోతుంది. అక్కడితో సినిమా అయిపోతుంది. సమాజం మనుషులను బతికి ఉండగానే ఎలా పీక్కుతింటుందో ఇందులో చూపించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి. ఈ సినిమాను పిల్లలతో చూడలేం. టాప్ లెస్ సన్నివేశాలు ఉంటాయి. అందుకే థియేటర్‌లో విడుదల చేయలేదు.


ఎక్కడ చూడవచ్చు అంటే?


ఇక ‘బిర్యానీ’ సినిమా UAN ఫిల్మ్ హౌస్ బ్యానర్ లో తెరకెక్కింది. లియో టామ్ సంగీతం అందించగా, కార్తీక్ ముత్తుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ఈ సినిమా ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఎక్స్‌ స్ట్రీమ్ ప్లేలో అందుబాటులో ఉంది. డైలీ మోషన్‌ వీడియో సైట్‌లో కూడా ప్లే అవుతోంది.


Read Also: 'టిల్లు స్క్వేర్‌' సక్సెస్‌ మీట్‌ - స్టేజ్‌పై అనుపమకు అవమానం, హీరోయిన్‌ని అలా కించపరచడమేంటి?