నీరోజ్ పుచ్చా (Nerroze Putcha), సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్కాస్ కథానాయకులుగా నటించిన చిత్రం 'భారతీయాన్స్' (Bharateeeyans Movie). ఈ చిత్రంతో 'ప్రేమించుకుందాం రా', 'కలిసుందాం రా', 'లాహిరి లాహిరి లాహిరిలో' వంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పని చేసిన దీన్ రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ కథానాయికలుగా నటించారు. 


'భారతీయాన్స్' చిత్రాన్ని భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ఎన్నారై డా. శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. చిత్రీకరణ కొన్ని రోజుల క్రితం పూర్తి అయ్యింది. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయ్యింది. అయితే... ఇంకా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాలేదు. ఆ విషయంలో ఓ సమస్య తలెత్తింది. సెన్సార్ బోర్డు చేసిన సూచన పట్ల నిర్మాత విస్మయం వ్యక్తం చేశారు. 


సెన్సార్ బోర్డుతో విభేదిస్తున్నా - శంకర్ నాయుడు
భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేందుకు విఫల యత్నాలు చేస్తూ, అనునిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా దురహంకారానికి, సరిహద్దుల్లో ఆ దేశ సైనికులు చేస్తున్న దుశ్చర్యలకు వ్యతిరేకంగా తెరకెక్కిన తమ చిత్రానికి సెన్సార్ పరంగా కలుగుతున్న అసౌకర్యం పట్ల శంకర్ నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. మాతృదేశంపై తనకు గల అభిమానం, మమకారంతో, లాభాపేక్ష లేకుండా ఎన్నో వ్యయ ప్రయాసలతో నిర్మించిన బహు భాషా చిత్రం 'భారతీయన్స్'కు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని శంకర్ నాయుడు తూర్పారా పట్టారు. చిత్రంలోని చైనా పేరును, గల్వాన్ వ్యాలీ పేరును తొలగించాలని సెన్సార్ బోర్డ్ చేసిన సూచనతో తాను విభేదిస్తున్నానని, ఈ విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోనని శంకర్ నాయుడు తేల్చి చెప్పారు.


Also Read : మెగా ఇంట మహాలక్ష్మి - పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన!


మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, క్రికెటర్ ఏబీ డివిలియర్స్, త్రివిధ దళాల్లో పని చేసిన మాజీ సైనికాధికారుల ప్రశంసలను 'భారతీయాన్స్' సినిమా అందుకుంది. చైనా నీచ బుద్ధి ఎండగడుతూ రూపొందిన 'భారతీయన్స్' సంచలన విజయం సాధించాలని మాజీ సైనికాధికారులు శ్రీనేష్ కుమార్ నోరి, కెప్టెన్ సురేష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు కోరుకున్నారు. కొన్ని రోజుల క్రితం సినిమా ప్రత్యేక ప్రదర్శనను వీక్షించిన త్రివిధ దళాల మాజీ అధికారులు... దేశ రక్షణ కోసం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తాము నిర్వర్తించిన విధులను గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు.


చైనా పేరు తీసేయమన్నారు... 
ఎందుకో తెలియడం లేదు!
చిత్ర నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు మాట్లాడుతూ ''భారత సైనికుల ప్రాణాలు బలి తీసుకుంటూ... మన దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించే నీచ చర్యలకు పాల్పడుతున్న చైనా పేరును తొలగించాలని సెన్సార్ సభ్యులు తమకు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ విషయంలో మేం ఎంత దూరం వెళ్ళడానికి అయినా సిద్ధంగా ఉన్నాం'' అని చెప్పారు. ఈ చిత్రానికి పోరాటాలు : జూడో రాము, కూర్పు : శివ సర్వాణి, ఛాయాగ్రహణం : జయపాల్ రెడ్డి నిమ్మల, సంగీతం : సత్య కశ్యప్ & కపిల్ కుమార్.


Also Read : పాపం, రష్మిక మందన్న - రూ.80 లక్షలతో ఉడాయించిన ఘనుడు!