Bhagyashri Borse Pair With Natural Star Nani : హీరో నాని టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. గత ఏడాది 'దసరా', 'హాయ్ నాన్న' లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ ఆగస్టులో 'సరిపోదా శనివారం' అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే మరికొన్ని ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసాడు నాని. అందులో 'ఓజీ' డైరెక్టర్ సుజిత్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. రీసెంట్ గా నాని బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది.


నాని - సుజిత్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్


సుజీత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'ఓజి' సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే నాని సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌ను మూవీ టీం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ టాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ మూవీలో నాని సరసన లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే నటించబోతుందట. ఇటీవల మేకర్స్ భాగ్యశ్రీ బోర్సేతో సంప్రదింపులు జరపగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. టాలీవుడ్లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే ఈ ముద్దుగుమ్మకి ఇలా వరుస అవకాశాలు వస్తుండడం విశేషం.


'మిస్టర్ బచ్చన్'తో ఆరంగేట్రం


భాగ్యశ్రీ బోర్సే 'యారియాన్ 2' అనే హిందీ సినిమాతో హీరోయిన్‌గా సినీ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు టాలీవుడ్ లో ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. హరీష్ శంకర్ - రవితేజ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాతో భాగ్యశ్రీ తెలుగు వెండితెరకి హీరోయిన్ గా ఆరంగేట్రం చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ రిలీజ్ కాకముందే టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానితో సైతం జత కడుతోంది.


 పాన్ ఇండియా లెవెల్ లో 'సరిపోదా శనివారం' రిలీజ్


మొన్నటి వరకు రీజినల్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న నాని.. గత ఏడాది వచ్చిన 'దసరా' మూవీతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టాడు. ఫస్ట్ అటెంప్ట్ తోనే పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'హాయ్ నాన్న' కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. ఇక తాజాగా నటిస్తున్న 'సరిపోదా శనివారం' కూడా పాన్ ఇండియా వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.


Also Read : నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు - అది ఇప్పటి ఫోటో కాదు : విజయ్ దేవరకొండ