గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)  తనయుడు వెండితెరకు ఎప్పుడు పరిచయం అవుతున్నారు? నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో అట్టహాసంగా తానా మహాసభల్లో ఈ ప్రశ్నలకు ఆఫ్ ది రికార్డ్ బాలకృష్ణ సమాధానం చెప్పారట. 


'ఆదిత్య 999'తో మోక్షజ్ఞ ఎంట్రీ!
బాలకృష్ణ సినీ ప్రయాణంలో స్పెషల్ సినిమాలు కొన్ని ఉన్నాయి. 'ఆదిత్య 369' (Aditya 369) అయితే మరీ మరీ స్పెషల్. కంటెంట్, టెక్నాలజీ పరంగా హాలీవుడ్ స్థాయి సినిమా అది. దానికి సీక్వెల్ వస్తే చూడాలనేది ప్రేక్షకులు చిరకాల కోరిక. బాలకృష్ణ సైతం సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. . ఆయన వందో సినిమా 'ఆదిత్య 369' సీక్వెల్ అవుతుందని వినిపించింది. అయితే... అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు ఆ సినిమా పట్టాలు ఎక్కే సమయం వచ్చిందని టాక్.


'ఆదిత్య 369' సీక్వెల్‌కు 'ఆదిత్య 999 మాక్స్' (Aditya 999 Max) టైటిల్ ఖరారు చేశారు. కథ కూడా రెడీ అయ్యింది. అందులో బాలకృష్ణ హీరోగా నటిస్తారు. తనతో పాటు మరో ప్రధాన పాత్రలో నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) నటిస్తాడని, రాబోయే ఏపీ ఎన్నికల తర్వాత సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళతామని 'తానా'లో అభిమానులకు బాలకృష్ణ చెప్పారట. అంటే... వచ్చే ఏడాది బాలకృష్ణ తనయుడి సినిమా ప్రారంభం అవుతుంది. విడుదల ఎప్పుడు? అనేది బాలకృష్ణ చేతిలో ఉంటుంది. 


సీక్వెల్ కథ రాసిన బాలకృష్ణ!
ఇంకా ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... ఈ చిత్రానికి బాలకృష్ణ కథ రాయడం! శర్వానంద్, అడివి శేష్‌ అతిథులుగా పాల్గొన్న 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్‌లో ఆ విషయాన్ని బాలయ్యే వెల్లడించారు. 'ఆదిత్య 999 మాక్స్'తో మోక్షజ్ఞ తెరంగేట్రం ఖాయమని ఓ స్పష్టత వచ్చింది. దాంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read : నాగార్జునే 'బిగ్ బాస్' హోస్ట్ - ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారంటే?


ఇప్పుడు బాలకృష్ణ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... యువ దర్శకుడు అనిల్ రావిపూడితో 'భగవంత్ కేసరి' సినిమా చేస్తున్నారు. అందులో ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. శ్రీలీల కీలక పాత్ర చేస్తున్నారు. ఇటీవల బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశారు. ఎన్నికలకు ముందు ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తనతో 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో మరో సినిమా చేయడానికి బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారట. అది 'ఆదిత్య 999 మ్యాక్'కు ముందు ఉంటుందా? తర్వాత ఉంటుందా? అనేది చూడాలి.


Also Read బాలకృష్ణ అభిమాని... కలకత్తా వెళ్లి మరీ మార్టినెజ్‌తో ఫోటో, ఎవరీ మార్టినెజ్‌?

 


టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన 'ఆదిత్య 369'కు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. అందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో అద్భుతంగా నటించారు. ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయలు ఆహార్యంలో ఆయన నటన అద్భుతం. ప్రస్తుతం సింగీతం వయసు దృష్ట్యా 'ఆదిత్య 999 మాక్స్'కు ఆయన దర్శకత్వం వహించే అవకాశాలు తక్కువ. వేరొకరి చేతిలో బాలకృష్ణ దర్శకత్వ బాధ్యతలు పెడతారా? లేదంటే ఆయనే చేపడతారా? అనేది చూడాలి.





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial