ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, సర్జన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మధ్య గత కొంత కాలంగా  వివాదం కొనసాగుతోంది.  ఈ వివాదంలో భాగంగా సర్జన్స్ అసోసియేషన్ పై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేశాడు రెహమాన్. వాస్తవానికి ఈ వివాదం 2018లో మెుదలైంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..


అసలు ఏం జరిగిందంటే?


రెహమాన్ 2018లో చెన్నైలో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించాలి అనుకున్నారు. ఈ ఈవెంట్ ను సర్జన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. కానీ, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయ్యింది. అయితే, ఈ మ్యూజిక్ ఈవెంట్ కోసం రెహమాన్ కు సర్జన్స్ అసోసియేషన్ రూ. 29.50 లక్షలు చెల్లించింది. ఈవెంట్ రద్దు కావడంతో సదరు డబ్బును వెనక్కి ఇవ్వాలని రెహమాన్ ను కోరింది. రెహమాన్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. తమను మోసం చేసిన రెహమాన్ మీద చర్యలు తీసుకోవాలంటూ సర్జన్స్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


అంతేకాదు, న్యాయవాది ద్వారా ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు. రెహమాన్ తరఫున న్యాయవాది నర్మదా సంపత్‌ కూడా సర్జన్స్ అసోసియేషన్ కు నోటీసులు పంపించారు. ఈ నోటీసులలో ఏఆర్ రెహమాన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. చీప్ పబ్లిసిటీ కోసం రెహమాన్‌పై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రెహమాన్‌కు వారు ఇచ్చిన డబ్బు అందలేదని ఆయన తెలిపారు. రెహమాన్‌కు సంబంధంలేని మూడో వ్యక్తికి సర్జన్స్ అసోసియేషన్ డబ్బు ఇచ్చిందని చెప్పారు. అనవసరంగా ఇందులోకి రెహమాన్ ను లాగుతున్నారని వెల్లడించారు.  ఆ వివాదం అక్కడితో నిలిచిపోయింది.


రూ.10 కోట్ల నష్టపరిహారానికి నోటీసు


తాజాగా మరోసారి  రెహమాన్‌పై సర్జన్స్ అసోసియేషన్ ఈ రెహమాన్ డబ్బుల వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చింది. సదరు డబ్బును చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో రెహమాన్ టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెహమాన్‌కు సర్జన్‌ అసోసియేషన్‌ పంపిన నోటీసును 3 రోజుల్లో ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. అంతేకాదు, ఆయనకు జరిగిన పరువు నష్టానికి క్షమాపణలు చెప్పాలని రెహమాన్‌ లాయర్‌ నోటీసులు జారీ చేశారు. సమాజంలో తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు ఏఆర్ రెహమాన్‌కు రూ.10 కోట్లు పరిహారంగా చెల్లించాలని నోటీసులో ఆయన కోరారు. లేని పక్షంలో చట్టపరమైన, క్రిమినల్ చర్యలు తప్పవని  నోటీసు ద్వారా హెచ్చరించారు. ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది.


చెన్నైమ్యూజికల్ కాన్సర్ట్ పై సర్వత్రా విమర్శలు


రీసెంట్ గా రెహమాన్ రెహమాన్ చెన్నైలో నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది.  గ్రౌండ్ కెపాసిటీ మించి టికెట్లు అమ్మడంతో అక్కడికి వెళ్లిన అభిమానులు చాలా ఇబ్బంది పడ్డారు. నిర్వహకులు కనీస భద్రతా ఏర్పాటు పర్యవేక్షించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన రెహమాన్ జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ఇబ్బంది కలిగిన వారు టికెట్స్ ను తమ టీమ్ కు పంపిస్తే డబ్బు వాపస్ ఇప్పిస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సర్జన్స్ అసోసియేషన్ పాత కేసును బయటకు తీసింది.


Read Also: నాలో నేను బాధపడుతున్నా, ‘జవాన్’ బ్యూటీ ఆవేదన- అసలు ఏం జరిగిందంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial