‘జైలర్’ సంచలన విజయంతో మంచి జోష్ లో ఉన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. అదే ఉత్సాహంతో మరో సినిమా చేస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ‘తలైవా 170’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ఇవాళ మొదలైనట్లు తెలిపింది. ఈ మేరకు రజనీకాంత్ పోస్టర్ తో షూటింగ్ షూరూ అయ్యిందని తెలిపింది.  త్వరలో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ అనౌన్స్ మెంట్ తో  రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


కీలక పాత్రలు పోషించనున్న పలువురు అగ్ర హీరోలు


'తలైవా 170' సినిమా కోసం రజనీకాంత్ పలువురు అగ్రహీరోలతో చేతులు కలుపుతున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదేమీ తొలిసారి కాదు. 1991లో 'హమ్' అనే హిందీ ఫ్యామిలీ డ్రామాలో కలిసి పనిచేశారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు లెజండరీ నటులిద్దరూ జట్టు కట్టబోతున్నారు.మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ కూడా మరో ముఖ్యమైన పాత్ర కోసం ఎంపికయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి రానా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ పోస్టర్ ద్వారా వారి పాత్రలను మేకర్స్ కన్ఫామ్ చేశారు.


‘తలైవా 170’లో ముగ్గురు హీరోయన్లు


‘తలైవా 170’ మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ఇప్పటికే తెలిపింది. ఈ మేరకు వారి ఫోటోలతో స్పెషల్ పోస్టర్లను విడుదల చేసింది. రజనీ కాంత్ ప్రతిష్టాత్మక చిత్రంలో మంజూ వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ నటించబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో సదరు హీరోయిన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ తో కలిసి నటించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.   


ఈ సినిమా కథ ఏంటంటే? 


ఇక ఈ సినిమా ఓ బూటకపు ఎన్ కౌంటర్ కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు జ్ఞానవేల్ గతంలో జర్నలిస్టుగా పని చేశారు. చెన్నైలో ఆయన రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు ఓ బూటకపు ఎన్ కౌంటర్ చేశారట. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనను జ్ఞానవేల్ రిపోర్ట్ గా దగ్గరి నుంచి గమనించారు. అదే విషయాన్ని కథగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. చెన్నైలో ఇటీవల పూజా కార్యక్రమాలతో పనులు మొదలు పెట్టారట.


2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం


రజనీకాంత్, జ్ఞానవేల్ కాంబోలో వస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జైలర్’ మూవీతో రజనీకాంత్, ‘జైభీమ్’ సినిమాతో జ్ఞానవేల్ మంచి విజయాలను అందుకున్నారు. వీరిద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులలలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్‌ను సంగీతం అందిస్తున్నారు.






Read Also: ముంబై సిద్ధివినాయక ఆలయంలో రామ్ చరణ్ ప్రత్యేక పూజలు, గణనాథుడి సమక్షంలో అయ్యప్ప దీక్ష విరమణ



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial