గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా కనిపిస్తారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా ఉంటారు. అయ్యప్ప స్వామికి ఆయన పెద్ద భక్తుడు కూడా. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసి దీక్షను తీసుకుంటుంరు. ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. తాజాగా ఈ దీక్షను ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేశారు.


సిద్ధివినాయక ఆలయంలో దీక్ష విరమించిన రామ్ చరణ్   


అయ్యప్ప స్వామి దీక్షను పాటించే వారు చాలా నిష్టగా ఉంటారు. రామ్ చరణ్ సైతం అయ్యప్ప మాలధారులు పాటించే కఠిన నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారు. అయ్యప్ప మాలలో ఉన్నన్ని రోజులు నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. చెప్పులను ధరించరు. సిద్ధి వినాయకుని ఆలయంలోకి వెళ్లిన సమయంలోనూ ఆయన ఇదే నియమాలను ఆచరించారు. ఆలయంలో రామ్ చరణ్ సింప్లీసిటీని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. రామ్ చరణ్ ఇంత సింపుల్ గా ఉంటారా? అని చర్చించుకుంటున్నారు. రామ్ చరణ్ చేపట్టిన 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్ష తాజాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో అయ్యప్ప మాలను తీశారు రామ్ చరణ్. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. మాల విరమణ అనంతరం చెర్రీ ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.    


గతంలో అమెరికాలో దీక్ష విరమించిన చెర్రీ


రామ్ చరణ్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అయ్యప్ప దీక్షను చేపడుతుంటారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘గేమ్ ఛేంజర్’ లాంటి  భారీ సినిమాల్లో నటించే సమయంలోనూ ఆయన దీక్షను తీసుకున్నారు. గతంలో ‘ఆర్ఆర్ఆర్’  సినిమాను ప్రమోట్ చేయడానికి అయ్యప్ప స్వామి మాలలోనే రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. అక్కడ ఓ హిందూ ఆలయంలో మాల విరమణ చేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఆయన అలాగే చేశారు. ఈ ఏడాది ఆయన కుమార్తె క్లీంకార రాకతో స్వామివారి దీక్షను చేపట్టారు.


ఎయిర్ పోర్టులో కాళ్లకు చెప్పులు లేకుండా కనిపించిన చెర్రీ


తాజాగా ఒక యాడ్ షూట్ కోసం రామ్ చరణ్ ముంబై వెళ్లారు.  ఎయిర్‌పోర్టులో దిగిన ఆయన కాళ్లకు చెప్పులు లేకుండానే బయటకు వచ్చారు.  ముంబై ఎయిర్‌పోర్టులో రామ్ చరణ్  నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, తెలుగు జనాలకు ఇదేం కొత్త కాదు.  ఆయన అయ్యప్ప స్వామి మాలలో ఉండటంతో అలా చేశారని అందరికీ తెలుసు. కానీ, బాలీవుడ్ మీడియా దీన్ని హైలైట్ చేస్తోంది.  


‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లో చెర్రీ బిజీ


‘ఆర్ఆర్ఆర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు.  దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన  కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.  అంజలి, శ్రీకాంత్, సునీల్, SJ సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, అనన్య సహా పలువురు నటిస్తున్నారు.  థమన్ సంగీతం అందిస్తుండగా,  దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Read Also: ‘మంత్‌ ఆఫ్‌ మధు’ To ‘మామా మశ్చీంద్ర’- ఈ వారం పెద్ద హిట్ కొట్టే చిన్న సినిమా ఏదో?



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial