ప్రముఖ కోలీవుడ్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'విమానం'. అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్, మాస్టర్ దృవన్, మీరాజాస్మిన్, రాజేంద్రన్ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు. తెలుగుతోపాటు తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. శివప్రసాద్ యానాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాయి. అంత ఎమోషనల్ గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్. తండ్రి - కొడుకుల మధ్య ఉండే బాండింగ్ గురించి ఈ సినిమాలో చాలా ఎమోషనల్ గా చూపించబోతున్నారు. జి స్టూడియోస్, కిరణ్ కొరపాటి క్రియేటివ్ వర్క్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాతో ఒకప్పటి హీరోయిన్ మీరాజాస్మిన్ రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక జూన్ 9న ఈ సినిమా విడుదల కాబోతుండగా.. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ప్రమోషన్స్లో భాగంగా తాజాగా మూవీ టీం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు శివప్రసాద్, సముద్రఖని, ధనరాజ్, అనసూయ పాల్గొన్నారు.


ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు శివప్రసాద్ సినిమా గురించి ముఖ్యంగా తండ్రీ - కొడుకుల మధ్య బాండింగ్ గురించి మాట్లాడుతుండగా ఇదే సమయంలో అనసూయ తండ్రి గురించి ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ..  "అనసూయ గారి బర్త్డే రోజు ఆమె వాళ్ళ నాన్నగారిని ఏదో గిఫ్ట్ కావాలని అడిగారు. దాంతో వెంటనే అనసూయ వాళ్ల నాన్నగారు వెంటనే గిఫ్ట్ తీసుకొచ్చి అనసూయ గారికి ఇచ్చారు. ఆ తర్వాత మంచం మీద నీరసంగా పడుకున్నారు. అప్పుడు అనసూయ గారికి అర్థం కాలేదు. ఈరోజు నా బర్త్ డే కదా! మా నాన్న ఏంటి ఇలా నీరసంగా మంచం మీద పడుకున్నారని ఆమె అనుకున్నారు. అప్పుడు అసలు విషయం తెలిసింది.. వాళ్ల నాన్నగారు తన రక్తం అమ్మి మరీ అనసూయ గారికి గిఫ్ట్ తెచ్చారని. ఈ విషయం నాకు అనసూయ చెప్తే.. నేను షాక్ అయిపోయా. అంటే ప్రతి తండ్రి తన పిల్లల కోసం ఏదో ఒక త్యాగం అనేది చేస్తాడు. అసలు నాన్న ప్రేమ పుట్టేదే త్యాగం నుంచి. నా లైఫ్ లో కూడా మా నాన్నా గారే నాకు రియల్ హీరో" అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆయన అలా చెప్తున్న సందర్భంలో అనసూయ తన తండ్రిని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది.


తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ ఇంటర్వ్యూలో దర్శకుడు చెప్పిన దాన్ని బట్టి అనసూయ తండ్రికి తన కూతురు అంటే ఎంత ప్రేమో స్పష్టమవుతుంది. ఇక 'విమానం' సినిమాలో కూడా ఓ తండ్రి తన కొడుకు కోసం త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. తన కొడుకుని విమానం ఎక్కించడానికి ఓ తండ్రి పడే ఆవేదనను ఈ సినిమాలో చాలా ఎమోషనల్ గా చూపించబోతున్నారు. ముఖ్యంగా ట్రైలర్లో కన్న కొడుకును ఎలాగైనా విమానంలో తీసుకెళ్లేందుకు పది వేల కోసం తండ్రి తన సైకిల్ని  అమ్మే సీన్ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ఇక సినిమాలో అంగవైకల్యంతో బాధపడే తండ్రి వీరయ్య పాత్రలో సముద్ర ఖని నటిస్తుండగా, అతని కొడుకు పాత్రలో మాస్టర్ ధృవన్ కనిపించనున్నాడు.


Also Read: అందుకే సీరియల్స్ మానేశా, రవి నా కంటే ముందే ప్రయత్నించాడు: నటి నవ్య స్వామి