Anasuya Bharadwaj: కొందరు నటీనటులు రాజకీయాల్లోకి రాకపోయినా.. వారు మాట్లాడే ప్రతీ విషయం కాంట్రవర్సీకి దారితీస్తుంది. అలాంటి వారిలో యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒకరు. సోషల్ మీడియాలో నెగిటివిటీపై అనసూయ స్పందించడం ఎన్నోసార్లు కాంట్రవర్సీలకు దారితీసింది. రాజకీయాల గురించి కూడా తను చాలాసార్లు మాట్లాడింది. అయితే ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయాల్సి వస్తే తను ఏ పార్టీకి చేస్తుందో తాజాగా బయటపెట్టింది. అంతే కాకుండా తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన ట్రాజిడీని కూడా చెప్పుకొచ్చింది. తనకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెట్టిన ‘జబర్దస్త్’ షో మానేయడానికి కారణాన్ని కూడా మరోసారి బయటపెట్టింది.


ఇబ్బంది అనిపించింది..


‘‘నేను జబర్దస్త్ మానేసే ఒకటిన్నర సంవత్సరం నుండి చర్చలు జరుగుతున్నాయి. నాకు అప్పట్లో ఒకేసారి చాలా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఒకేసారి 3 తెలుగు, 3 తమిళ చిత్రాలు చేస్తున్నాను. అందరూ షో వల్ల చాలా ఫేమస్ అయిపోయారు. వాళ్లు బయట దేశాల్లో కూడా ఈవెంట్స్‌కు వెళ్తుండేవారు. అప్పుడే నా ఒక్కదాని కోసం 2, 3 సార్లు డేట్స్ అడ్జస్ట్ చేయడం నాకే ఇబ్బంది అనిపించింది. ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. కుదిరినప్పుడల్లా కలవడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని ‘జబర్దస్త్’ వదిలేయడంపై మరోసారి క్లారిటీ ఇచ్చింది అనసూయ. ఇక నాగబాబు, రోజాలలో తనకు నాగబాబు ఎక్కువ క్లోజ్ అని బయటపెట్టింది. అయితే వాళ్లిద్దరూ ఒకేసారి తమ తమ పార్టీలకు సపోర్ట్ చేయమని పిలిస్తే అని ప్రశ్నించగా.. ఇద్దరూ పిలిస్తే ఇద్దరికీ సపోర్ట్‌గా వెళ్తాను అని చెప్పుకొచ్చింది అనసూయ.


అలా చేయడం తప్పు..


‘‘రాజకీయాలంటే నాకు అస్సలు ఆసక్తి లేదు. మా నాన్న కూడా రాజకీయాలు నా వల్లే మానేశారు. సపోర్ట్ చేయడానికి మాత్రం వెళ్తాను. ఎందుకంటే అది నా బాధ్యత. నేను ఉంటున్న సమాజంలో మంచి లీడర్ రావాలి అని వేరేవాళ్లకి చెప్పగలగడం, నా మాట వింటారని అనుకోవడం నా అదృష్టం. అది నా బాధ్యత కూడా. నేను చెప్తే వింటారు అన్నప్పుడు స్టేజ్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పు. ముఖ్యంగా సినిమా అనేది చాలామందిని ప్రభావితం చేస్తుంది’’ అని రాజకీయాలకు వెళ్లను కానీ ప్రచారాలకు వెళ్తానని స్పష్టం చేసింది అనసూయ. ఒకవేళ జనసేన నుండి పిలుపు వస్తే ప్రచారానికి వెళ్తారా అని అడగగా.. ‘‘పవన్ కళ్యాణ్ అంటేనే లీడర్. నాకు ఇంకా పార్టీ గురించి పూర్తిగా అవగాహన లేదు. కాబట్టి ఒకవేళ వెళ్తే మాత్రం పూర్తిగా కనుక్కునే వెళ్తాను’’ అని వివరించింది.


ఏడవడం తప్పు కాదు..


ఒకసారి కోట శ్రీనివాస రావు, అనసూయ మధ్య జరిగిన కాంట్రవర్సీ గురించి చాలామందికి తెలుసు. అనసూయ వేసుకున్న బట్టలు నచ్చవని కోట.. ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. అది నచ్చని అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆ విషయంపై కూడా స్పందించింది ఈ భామ. తనకు కోట రోల్ మోడల్ అని, ఇదంతా జరిగిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి చాలా మామూలుగా మాట్లాడారని బయటపెట్టింది. అయితే ఆ సమయంలో ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్ అనసూయ ఏడుస్తున్నట్టు ఫోటోలను యాడ్ చేసి థంబ్‌నెయిల్స్ పెట్టారు. అసలు అలా ఏడ్చిన వీడియో ఎప్పటిదో తను క్లారిటీ ఇచ్చింది. ‘‘నేను చాలాసార్లు ఏడ్చాను. నాకు చచ్చిపోవాలని అనిపించింది. చిన్న చిన్న కారణాలకే అలా అనిపించేది. ఏడవడం తప్పు కాదు అని చెప్పడానికి నేను ఆ వీడియో పెట్టాను. నా మీద నాకు అసహ్యం వేసినప్పుడు నేను మనిషిలాగా ఆలోచించాను అని అనిపించడానికి అలా వీడియోలు షూట్ చేస్తాను’’ అని స్పష్టంగా చెప్పుకొచ్చింది అనసూయ.


Also Read: అందుకే పెళ్లి క్యాన్సల్ చేశాను, రెండేళ్ల తర్వాత కచ్చితంగా దానిగురించి ఆలోచిస్తాను - రేణూ దేశాయ్