బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన.. తన ఇద్దరు కుమార్తెలను హీరోయిన్లుగా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. మొదటి భార్యకు పుట్టిన పూజా భట్ కొన్నేళ్ల పాటు అగ్ర కథానాయికగా రాణించగా, సెకండ్ వైఫ్ కు జన్మించిన ఆలియా భట్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. అయితే దర్శకుడు మహేశ్‌ భట్‌ తన కూతురు పూజాతో కలిసి చేసిన ఓ ఫోటో షూట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇందులో తండ్రీ కూతుర్లు లిప్ లాక్ చేసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై మూడు దశాబ్దాల తర్వాత పూజా తొలిసారిగా నోరు విప్పింది.


పూజా భట్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో 33 ఏళ్ల క్రితం తన తండ్రితో చేసిన ఫొటోషూట్‌ గురించి మాట్లాడింది. తండ్రిని ముద్దు పెట్టుకోవడం వల్ల ఆనాడు ఎదురైన ఇబ్బందులపై తొలిసారి స్పందించింది. మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అలాంటి ఫోటో షూట్‌ లో పాల్గొన్నందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదని తెలిపింది. తమ ఉద్దేశం మంచిదేనని.. కాకపోతే చూసేవాళ్లు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పూజా సమర్థించుకుంది.


‘‘అది చాలా మామూలు విషయం. కానీ ఆ ఫొటోలను కొంతమంది వేరేలా అర్థం చేసుకోవడం దురదృష్టకరం. తండ్రితో లిప్ కిస్ ఏంటి అని అప్పట్లో నాపై ఎన్నో విమర్శలు చేశారు. ఆ సమయంలో షారుఖ్‌ ఖాన్‌ చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. పిల్లలు చిన్నప్పుడు తమ తల్లిదండ్రులను ఇలాగే ముద్దు పెట్టుకుంటారు. పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా తల్లిదండ్రులు వాళ్లను చిన్నవాళ్లగానే చూస్తారని ఆయన నాతో అన్నారు. నిజం చెప్పాలంటే ఈ వయసులోనూ నా తండ్రి నన్ను ఒక చిన్న పిల్లలాగే చూస్తారు’’ అని పూజా భట్ తెలిపింది.


ఇంకా మాట్లాడుతూ.. ‘‘ఆ ఫొటోషూట్‌ చేసినప్పుడు సమాజం గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. విషయం ఏదైనా సరే ప్రజలు తమకు నచ్చిన విధంగా చూస్తుంటారు. తండ్రీకుమార్తెల మధ్య అనుబంధాన్ని ప్రశ్నించే వాళ్లు ఏదైనా ఊహించుకుని కామెంట్స్‌ చేయగలరు. అలాంటి వారే మళ్లీ కుటుంబ విలువల గురించి మాట్లాడతారు. అదే అతి పెద్ద జోక్‌’’ అని పూజా చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


కాగా, 17 ఏళ్ల వయసులో 'డాడీ' సినిమాతో తెరంగేట్రం చేసిన పూజా భట్.. 'జునూన్' ‘సడక్‌’, ‘దిల్‌ హై కీ మంతా నహీ’ 'ప్రేమ్ దీవానే' వంటి చిత్రాల్లో నటించింది. వరుస విజయాలు సాధించి టీనేజ్ లోనే స్టార్‌ స్టేటస్ అందుకుంది. అయితే 24 ఏళ్లకే సినిమాలకు బ్రేక్ తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటూ వచ్చింది. 2020లో ‘సడక్‌ 2’ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ బ్యూటీ.. 'చుప్' చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ‘బాంబే బేగమ్స్‌’ అనే నెట్ ఫ్లిక్స్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెట్టింది. బిగ్ బాస్ OTT సీజన్ 2 లో పాల్గొని, టాప్-5 కంటెస్టంట్ గా నిలచింది. 


Also Read: 2024 క్లాష్ ఆఫ్ సీక్వెల్స్: 'ఇండియన్ 2', 'సింగం 3' లతో ఫైట్ కు రెడీ అంటున్న 'పుష్ప 2'


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial