Akshay Kumar: ఇప్పుడు సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రేక్షకులు ఓటు వేస్తున్నారు. అలా ప్రేక్షకుల టేస్ట్ మారడంతో చాలామంది సీనియర్ హీరోలు రొటీన్ కమర్షియల్ చిత్రాలను నమ్ముకొని నష్టాలు చవిచూస్తున్నారు. దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఒకప్పుడు అక్షయ్ కుమార్‌కు ‘బాలీవుడ్ ఖిలాడి’ అని పేరు ఉండేది. కొంతకాలం వరకు అక్షయ్ కుమార్‌కు ఉన్న హిట్స్ ఇతర హీరోలకు లేవు. అలాంటి హీరో ఇప్పుడు నష్టాల్లో ఉన్నాడు. అక్షయ్ కుమార్‌కు వచ్చిన నష్టం చూసి బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతోంది.


ఖాన్స్‌కు పోటీ..


ఒకప్పుడు అక్షయ్ కుమార్‌కు ఆఫ్ స్క్రీన్‌ పాపులారిటీ వేరే లెవెల్‌లో ఉండేది. కానీ గత కొంతకాలంగా ఈ హీరో సినిమాల గురించి ప్రేక్షకులు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తన రొటీన్ యాక్షన్ సినిమాలు చూడడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ఎవరినీ ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి. ఒకప్పుడు ‘ఖిలాడి’ అనే టైటిల్‌తో అక్షయ్ కుమార్ నటించిన ప్రతీ సినిమా హిట్ అయ్యేది. ఆ తర్వాత వరుసగా బయోపిక్స్‌లో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. బాలీవుడ్‌లో ఖాన్స్‌కు పోటీగా స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోగా నిలబడ్డాడు అక్షయ్ కుమార్. కానీ అంతా మెల్లగా మారిపోతూ వచ్చింది.


వరుసగా 13 ఫ్లాపులు..


కోవిడ్ తర్వాత అక్షయ్ కుమార్‌కు ఒక్క హిట్ కూడా లేదు. తాజాగా విడుదలయిన ‘సర్ఫిరా’తో వరుసగా 13వ ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు ఈ హీరో. అంతకు ముందు తను నటించిన ‘బెల్ బాటమ్’, ‘లక్ష్మి’, ‘కట్‌పత్లి’, ‘అత్రంగి రే’, ‘బచ్చన్ పాండే’, ‘సామ్రాట్ పృథ్విరాజ్’, ‘రక్షా బంధన్’, ‘రామ్ సేతు’, ‘సెల్ఫీ’, ‘మిషన్ రాణిగంజ్’, ‘బడే మియా చోటే మియా’ చిత్రాలు కూడా ఫ్లాప్స్‌గా నిలిచాయి. ఇందులో కొన్ని చిత్రాలు అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కి డిశాస్టర్లుగా నిలిచాయి. దీంతో మొత్తం కలిపి.. అక్షయ్ కుమార్‌ మూవీలకు రూ.1000 కోట్లు నష్టం వచ్చినట్టు సమాచారం. ‘బడే మియా చోటే మియా’ రూ.250 కోట్లు పోగొట్టుకోగా.. ‘సామ్రాట్ పృథ్విరాజ్’ రూ.150 కోట్ల నష్టాన్ని చవిచూసినట్టు తెలుస్తోంది.


అవే కారణాలు..


అసలు అక్షయ్ కుమార్ ఈ రేంజ్‌లో ఫెయిల్యూర్‌ను చూడడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది సినిమా క్వాలిటీతో సంబంధం లేకుండా ఏ చిత్రానికి అయినా మూడు నెలలు మాత్రమే సమయాన్ని కేటాయిస్తాడు అక్షయ్. దీని వల్ల ఇండస్ట్రీలో తనకు పలుమార్లు ట్రోల్స్ కూడా ఎదుర్కున్నాడు. రెమ్యునరేషన్ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండే అక్షయ్.. మూవీ ఔట్‌పుట్ ఎలా ఉన్నా పట్టించుకోడని కొందరు నిర్మాతలు ఓపెన్‌గా స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. పైగా తన రాజకీయ అభిప్రాయాలను ఓపెన్‌గా బయటపెట్టడం వల్ల కూడా కొందరు ప్రేక్షకులు తన సినిమాలు చూడడం మానేశారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ అప్‌కమింగ్ మూవీ అయిన ‘ఖేల్ ఖేల్ మే’ ఆగస్ట్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే తెలుగులో మొదటిసారి ‘కన్నప్ప’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో అక్షయ్ శివుడి పాత్రలో కనిపించనున్నాడు.



Also Read: ఎలాంటి వ్యాయామం లేకుండానే 21 రోజుల్లో బరువు తగ్గిన నటుడు మాధవన్ - ఇంతకీ ఆ వెయిట్‌లాస్ సీక్రెట్ ఏమిటో తెలుసా?