Akkineni Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కినేని నాగార్జున తర్వాత ఇప్పుడు ఆయన ఇద్దరు కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ గత కొంత కాలంగా ఈ తండ్రీకొడుకులకు సరిగ్గా కలసి రావడం లేదు. హీరో నాగార్జున నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన నటించిన చివరి చిత్రం ‘ది ఘోస్ట్’. ఈ మూవీ ఆక్టోబర్ 2022 లో విడుదల అయింది. ఈ సినిమా తర్వాత నాగార్జున సినిమా అనౌన్స్ చేయలేదు. అయితే మధ్యలో ఓ కథను ఓకే చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ మూవీ గురించి ఇప్పటి వరకూ ఎలాంటి వార్తలు రాలేదు. దీంతో నాగార్జున కెరీర్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కినేని అభిమానులు.


రీమేక్ సినిమా ఓకే చేసిన నాగ్, కానీ..


‘ది ఘోస్ట్’ సినిమా తర్వాత నాగార్జున మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు. అయితే మొన్నామధ్యలో మలయాళ హీరో జోజు జార్జి నటించిన సూపర్ హిట్ సినిమా ‘పొరింజు మరియం జోస్‌’ ను రిమేక్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ మూవీకు దర్శకుడిగా ప్రసన్న కుమార్ బెజవాడ ను ఓకే చేశారని అన్నారు. ఈ మూవీ గురించి మే నెలలో అనౌన్స్ చేస్తారని, జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారని అన్నారు. అయితే ఇప్పుడు జూన్ నెల అయిపోవస్తున్నా ఇంకా నాగ్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. దీంతో అసలు నాగార్జున సినిమాలు చేస్తారా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట అక్కినేని అభిమానులు. 


కొడుకుల్ని దారిలో పెట్టడానికేనా?


నాగార్జున హీరోగా తన కెరీర్ లో చాలా హిట్లు అందుకున్నారు. ఆయన తరువాత సినీ వారసులుగా వచ్చిన నాగచైతన్య, అఖిల్ కూడా హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నాగ చైతన్య పలు హిట్ సినిమాల్లో నటించగా అఖిల్ సరైన హిట్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. అయితే కొన్నేళ్ల నుంచి వీరి మావీలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. రీసెంట్ గా అఖిల్ ‘ఏజెంట్’ మూవీతో మరో ఫ్లాప్ ను అందుకున్నారు. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. కానీ మూవీ అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. ఇక నాగచైతన్య కూడా రీసెంట్ గా ‘కస్టడీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ‘మజిలీ’ సినిమా తర్వాత నాగచైతన్యకు సరైన హిట్ రాలేదు. మధ్యలో ‘బంగార్రాజు’ సినిమా కాస్త పర్వాలేదనిపించినా కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది. దీంతో సీన్ లోకి నాగార్జున ఎంటర్ కావాల్సి వచ్చిందట. కొడుకులిద్దర్నీ సక్సెస్ ట్రాక్ లోకి పెట్టడంపైనే ప్రస్తుతం నాగార్జున దృష్టి పెట్టారట. స్క్రిప్ట్ సెలక్షన్ లో వారి వెనకుండి సపోర్ట్ చేస్తున్నారట. అందుకే నాగార్జున సినిమాలు లేట్ అవుతున్నాయని ఫిల్మ్ వర్గాల్లో టాక్. ‘ది ఘోస్ట్’ తర్వాత నాగార్జున 6 నెలలు గ్యాప్ తీసుకుంటానని అన్నారు. కానీ ఇప్పుడు 8 నెలలు దాటుతుంది. మరి ఆయన ఫ్యాన్స్ కు మళ్లీ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో చూడాలి. 



Read Also: ‘ది ఆర్చీస్’ ట్రైలర్‌: కాలాన్ని వెనక్కి తీసుకెళ్లిన స్టార్ కిడ్స్ - షారుఖ్‌, అమితాబ్, శ్రీదేవి వారసులు ఇరగదీశారంతే!