'SMS', 'ప్రేమ కథా చిత్రం', 'సమ్మోహనం', 'శ్రీదేవి సోడా సెంటర్' వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు ఆ క్రేజ్ ను కాపాడుకునేందుకు విభిన్న తరహా కథలను ఎంచుకొని ప్రతి సినిమాకి బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కెరీర్ బిగినింగ్ లో తన సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ బాబు ఈ మధ్యకాలంలో వరుస అపజయాలు అందుకుంటున్నాడు. నిజానికి తన తోటి హీరోలు రొటీన్ సినిమాలు చేస్తుంటే సుదీర్ బాబు మాత్రం డిఫరెంట్ జానర్ మూవీస్ చేస్తున్నా, టైం బాగా లేకో, అదృష్టం లేకో ఇప్పటివరకు కమర్షియల్ హీరో స్టేటస్ మాత్రం అందుకోలేకపోయాడు.


ఇక 'సమ్మోహనం' తర్వాత సుధీర్ బాబుకి మళ్ళీ ఆ రేంజ్ లో హిట్ రాలేదు. ఈ ఏడాది రిలీజ్ అయిన 'హంట్' సుధీర్ బాబు కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ప్రస్తుతం సుధీర్ బాబు ఆశలన్నీ తాను నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మామా మశ్చీంద్ర' పైనే ఉన్నాయి. ఈ సినిమా కోసం సుధీర్ బాబు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే సినిమాలో త్రీ డిఫరెంట్ గెటప్స్ తో ఆకట్టుకుపోతున్నాడు. ఇప్పటికే ఆ పాత్రల తాలూకు ఫస్ట్ లుక్స్ విడుదలై ఆకట్టుకున్నాయి. ఇక మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు మేకర్స్. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా మూవీ నుంచి మేకర్స్ 'అడిగా అడిగా' అంటూ ఎమోషనల్ గా సాగే అమ్మ పాటను రిలీజ్ చేశారు.


చైతన్య భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటను శ్రీనివాసన్ ఆలపించాడు. తాజాగా విడుదలైన ఈ పాట చాలా ఎమోషనల్ గా సాగింది. సినిమాలో హీరోకి తన తల్లితో ఉండే ఎమోషనల్ బాండింగ్ లో భాగంగా ఈ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఇందులో చిన్నప్పుడు హీరో తల్లిగా నటి అభినయ కనిపించింది. తాజాగా విడుదలైన ఈ ఎమోషనల్ సాంగ్ సోషల్ మీడియాలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సుధీర్ బాబు సరసన ఈషా రెబ్బ, మృణాళిని రవి నటిస్తున్నారు. రాజీవ్ కనకాల, అజయ్, హర్షవర్ధన్ హరితేజ అలీ రెజా, మిర్చి కిరణ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ప్రముఖ నటుడు హర్షవర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై సునీల్ నారంగ్, పుష్కర రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చైతన్య భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. అక్టోబర్ 6 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు 'హరోం హరా' అనే సినిమా చేస్తున్నారు సుధీర్ బాబు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గంగసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నారు.


Also Read : రామ్ అంటే అంత అభిమానం - కుమారుడిగా కొత్త సినిమా పేరు పెట్టేశారు!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial