‘కేరళ స్టోరీ’ సినిమాతో హిట్ కొట్టిన అదా శర్మ.. త్వరలో ‘కమాండో’ వెబ్ సీరిస్ ద్వారా ముందుకొస్తోంది. అయితే, ఈ వెబ్ సీరిస్ ప్రమోషన్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అదా శర్మ అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. డయేరియా వల్లే ఆమె ఆరోగ్యం క్షీణించిందని, పూర్తి కోలుకోడానికి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అదా శర్మ సినిమాలకు బ్రేక్ చెప్పింది. ఈ సందర్భంగా తన ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్ చేసింది. దద్దుర్లతో దారుణంగా మారిపోయిన ఆమె శరీరాన్ని చూసి.. అభిమానులు షాకయ్యారు. 


అదాకు ఏమైంది?


అదా తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్ది రోజులుగా ఆమె శరీరంపై అక్కడక్కడా దద్దుర్లు వచ్చాయి. అయితే, చిన్న సమస్యే అనుకుని ఆమె వాటిని పెద్దగా పట్టించుకోలేదు. చేతులపై ఉన్న దద్దర్లను ఫుల్ స్లీవ్స్‌తో కవర్ చేస్తూ షూటింగ్స్‌లో పాల్గొంది. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. చివరికి దద్దర్లు ఆమె ముఖంపై కూడా వచ్చాయి. దీంతో ఆమె మందులు వాడటం మొదలుపెట్టింది. ఆ మెడిసిన్ వికటించడంతో మరింత అలెర్జీ ఏర్పడింది. ప్రమోషన్స్‌కు వెళ్తుండగా వాంతులతో అస్వస్థతకు గురైంది. డయేరియా వల్లే ఆమె అనారోగ్యానికి గురైందని వైద్యులు తెలిపారు.  


ఎంతకీ పరిస్థితి మెరుగుకాకపోవడంతో అదా ఆయుర్వేద చికిత్సను ఆశ్రయించింది. ఈ సందర్భంగా కొద్ది రోజులు సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్‌కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. అదా పరిస్థితి చూసి ఆందోళనకు గురైన ఆమె తల్లి కూడా గట్టిగా హెచ్చరించినట్లు తెలిసింది. ఇంటర్వ్యూలు, షూట్‌లకు బ్రేక్ ఇచ్చి, విశ్రాంతి తీసుకోవాలని అమ్మ చెప్పిందని అదా పేర్కొంది. ‘‘నేను త్వరలోనే తిరిగి వస్తా. అప్పటి వరకు నేను ‘కమాండో’ సీరిస్‌లోని సన్నివేశాలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్ చేస్తూనే ఉంటాను’’ అని తెలిపింది. అయితే, ట్రోలర్స్ మాత్రం.. ఆమెకు పంచ్‌లు వేస్తున్నారు. ఆయుర్వేద వైద్యం కోసం కేరళ వెళ్తున్నావా? అని అంటున్నారు. కేరళ ప్రజలు నీ మీద కోపంగా ఉన్నారు జాగ్రత్త అని కొందరు అంటున్నారు. చివరికి నీకు కేరళనే దిక్కయ్యిందని మరికొందరు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం అదాకు మద్దతు తెలుపుతున్నారు. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే అలా ఎలా ట్రోల్ చేస్తారని కామెంట్లు చేస్తున్నారు. 






2013లో కమాండో సినీ ఫ్రాంచైజ్ మొదలయ్యింది. కమాండ్ వన్ మ్యాన్ ఆర్మీ టైటిల్‌తో ఈ ఫ్రాంచైజ్‌లో మొదటి చిత్రం తెరకెక్కింది. ఇందులో విద్యుత్ జమ్వాల్, పూజా చోప్రా లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక 2017లో కమాండో సీక్వెల్ విడుదలయ్యింది. దాని పేరే ది బ్లాక్ మనీ ట్రయల్. ఇందులో పూజా చోప్రా స్థానంలోకి అదా శర్మ వచ్చి చేరింది. 2019లో వచ్చిన కమాండో 3లో కూడా అదా శర్మనే హీరోయిన్‌గా నటించింది. ఇక కేరళ స్టోరీ లాంటి హిట్‌ను ఖాతాలో వేసుకున్న అదా శర్మ.. తను అస్వస్థతకు గురికాకముందు కమాండో వెబ్ సిరీస్‌లో నటించడంపై తన స్పందన బయటపెట్టింది. ‘కమాండో 2,3లో నేను భావన రెడ్డి పాత్రను పోషించారు. కమాండో ఎక్కడ ఉంటే భావన రెడ్డి అక్కడ ఉంటుంది. అది కాసేపు అయినా సరే ఉంటుంది. ఓటీటీలో విడుదల కానున్న కమాండోకు, సినిమాకు భావన ఒక కనెక్షన్‌లాగా ఉంటుంది’ అని తెలిపింది అదా.


Also Read: తమిళనాట అన్ని థియేటర్లలోనూ 'జైలర్' - రజనీకి ఎగ్జిబిటర్స్ రిక్వెస్ట్