హీరోయిన్ పాయల్ ఘోష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రయాణం, ఊసరవెల్లి వంటి సినిమాలలో నటించిన ఈ బెంగాలీ భామ.. చాలా కాలం క్రితమే టాలీవుడ్ కు దూరమైంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వీలుచిక్కినప్పుడల్లా బాలీవుడ్ పై విరుచుకుపడే పాయల్.. లేటెస్టుగా మరోసారి హిందీ నటులను టార్గెట్ చేసింది. ఈసారి సీనియర్ హీరో బాలకృష్ణను పొగుడుతూ, బాలీవుడ్ యాక్టర్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 'అఖండ', 'వీర సింహా రెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. 63 ఏళ్ల వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తూ, నేటి తరం నటీనటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని పాయల్ ఘోష్ తన తాజా ట్వీట్ లో ప్రస్తావిస్తూ, బాలీవుడ్ యాక్టర్స్ అందరూ బాలయ్యని చూసి నేర్చుకోవాలని సూచించింది.


"బాలకృష్ణ సార్ ఈ ఏజ్ లో కూడా సూపర్ హిట్స్ కొడుతున్నారు... బాలీవుడ్ నటీనటులు ఆయన నుండి ఎంతో నేర్చుకోవాలి" అని పాయల్ ఘోష్ శనివారం సంచలన ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా బాలయ్యతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఓవైపు బాలయ్యని పొగుడుతూనే, మరోవైపు పనిలో పనిగా హిందీ యాక్టర్స్ పై సెటైర్లు వేసింది. పాయల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. నందమూరి ఫ్యాన్స్ ఆమెకు మద్దతుగా ట్వీట్స్ చేస్తుండగా, హిందీ సినీ అభిమానులు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.






Also Read: బాలీవుడ్ లో భంగపాటు - పాన్ ఇండియా స్టార్స్ అవుదామని బోల్తాపడ్డ టాలీవుడ్ హీరోలు!


పాయల్ ఘోష్ హిందీ చిత్ర పరిశ్రమను, బాలీవుడ్ యాక్టర్స్ ను విమర్శించడం ఇదేమీ మొదటి సారి కాదు. కొన్ని రోజుల క్రితం ఆమె ట్వీట్ చేస్తూ "నేను సౌత్ సినిమాతో ఆరంగేట్రం చేసాను కాబట్టి సరిపోయింది, అదే బాలీవుడ్ లో అయితే నన్ను చూపించడానికి బట్టలు విప్పేసేవారు. ఎందుకంటే అక్కడ క్రియేటివిటీ కన్నా అమ్మాయిల శరీర సౌందర్యం మీదే ఆధారపడతారు" అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అలానే తాను కాస్టింగ్ కౌచ్ కి లొంగిపోయి ఉంటే ఈపాటికి 30 సినిమాలు చేసేదాన్ని అని వ్యాఖ్యానించింది.


హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లోని డ్రగ్స్ వ్యవహారంతో పాటు లైంగిక వేధింపులపైనా నోరు విప్పింది పాయల్. అలానే బాలీవుడ్‌ దర్శక నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ తనపై లైంగిక దాడి చేశారంటూ సంచలన ఆరోపణలు చేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీనిపై ఆమె రాష్ట్రపతికి లేఖ రాయడమే కాదు, జాతీయ మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి తరచుగా బాలీవుడ్ ను ఉద్దేశిస్తూ ఏదొక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.


కాగా, మంచు మనోజ్ హీరోగా నటించిన 'ప్రయాణం' సినిమాతో హారికగా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది పాయల్ ఘోష్. ఆ తర్వాత తన అసలు పేరుతోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'ఊసరవెల్లి' సినిమాలో నటించింది. ఇదే క్రమంలో 'మిస్టర్ రాస్కెల్' అనే మూవీలో మెరిసింది. తెలుగులో సరైన గుర్తింపు దక్కకపోవడంతో అమ్మడు బాలీవుడ్ కి చెక్కేసింది. అయితే అక్కడ కూడా ఆమెకు ఆశించిన అవకాశాలు రాలేదు. పాయల్ చివరగా 'ఫైర్ ఆఫ్ లవ్: రెడ్' అనే హిందీ సినిమాలో నటించింది.


Also Read: సామ్ నుంచి జాన్వీ వరకూ.. డీ గ్లామర్ రోల్స్ లో గ్లామరస్ హీరోయిన్స్!