టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా జపం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు నార్త్ లో మంచి క్రేజ్ ఏర్పడటంతో, ప్రతీ ఒక్కరూ తమ సినిమాలని  అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 'పాన్ ఇండియన్ స్టార్' ఇమేజ్ తెచ్చుకోడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించుకోగా, మరికొందరు హీరోలు మాత్రం పాన్ ఇండియా బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డారు.


ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ అగ్ర హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా వెలుగుతున్నారు. తమ ఇమేజ్ ను కాపాడుకునే విధంగా భారీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు. అదే సమయంలో నేచురల్ స్టార్ నాని, ఉస్తాద్ రామ్ పోతినేని, మాస్ మహారాజా రవితేజ, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ లాంటి పలువురు మీడియం రేంజ్ హీరోలు బాలీవుడ్ లో భంగపడ్డారు. హిందీలో మార్కెట్ విస్తరించుకోవాలనుకున్న వారి ప్లాన్స్ వర్కౌట్ అవ్వలేదు.


Also Read: ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న లేటెస్ట్ సినిమాలు ఇవే, రేపు మరిన్ని!


రవితేజ:
రవితేజ టైటిల్ రోల్ పోషించిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని, ఇటీవల దసరా సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. తన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో రవితేజ బాలీవుడ్ లో విపరీతంగా ప్రచారం చేశారు. ఎంత చేసినా ప్రమోషనల్ కంటెంట్ కు వచ్చిన రెస్పాన్స్, సినిమాకి రాలేదు. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం.. హిందీలో ప్రభావం చూపించలేకపోయింది. నిడివి తగ్గించిన తర్వాత తెలుగులో అంతో ఇంతో వసూళ్లు రాబట్టింది కానీ, నార్త్ లో నిరాశ పరిచింది. 


రామ్ పోతినేని:
రవితేజ కంటే ముందు హీరో రామ్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో  నటించిన 'స్కంద' సినిమాని తెలుగుతో పాటుగా హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేశారు. రామ్ - బోయపాటిల హిందీ డబ్బింగ్ చిత్రాలకు హిందీ మార్కెట్ లో మంచి క్రేజ్ ఉండటంతో, ఈ మూవీ కచ్ఛితంగా ఉత్తరాది ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని అందరూ భావించారు. కానీ ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను హిందీలో పెద్దగా పట్టించుకోలేదు.


విజయ్ దేవరకొండ:
'లైగర్' సినిమాతో ఇండియాని షేక్ చెయ్యాలనుకున్నారు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. దేశం మొత్తం తిరుగుతూ దూకుడుగా ప్రమోషన్స్ చేశారు కానీ, చివరకు నిరాశే మిగిలింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ తర్వాత సమంతతో కలిసి నటించిన 'ఖుషి' చిత్రాన్ని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసినా ఆడలేదు. 


నాని:
నాని నటించిన 'దసరా' సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ చేశారు. 'పుష్ప' లాంటి రా అండ్ రస్టిక్ మూవీకి నార్త్ లో బ్రహ్మరథం పట్టడంతో, అలాంటి కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని అనుకున్నారు. కానీ ఈ సినిమా హిందీలో ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. తెలుగులో హిట్ అయింది కానీ, బాలీవుడ్ లో మాత్రం ప్రభావం చూపలేదు. 


విశ్వక్ సేన్ & నిఖిల్ సిద్దార్థ్:
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన 'దాస్ కా ధమ్కీ' మూవీని బాలీవుడ్ జనాల్లోకి తీసుకెళ్లాలని ట్రై చేశారు కానీ, ఫలితం లేకుండా పోయింది. 'కార్తికేయ 2' సినిమాతో ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు యువ హీరో నిఖిల్ సిద్దార్థ్. దీంతో వెంటనే 'స్పై' మూవీని కూడా భారీ ఎత్తున బాలీవుడ్ లో రిలీజ్ చేశారు. కానీ ఈసారి మాత్రం అదృష్టం కలిసి రాలేదు. 


సాయి తేజ్ & బెల్లంకొండ శ్రీనివాస్:
మెగా హీరో సాయి తేజ్ నటించిన 'విరూపాక్ష' చిత్రాన్ని కూడా పాన్ ఇండియా హిట్ చెయ్యాలని ప్లాన్ చేశారు. హిందీ రిలీజ్ విషయంలో 'కాంతారా'ను ఫాలో అయ్యారు. తెలుగులో రిలీజైన రెండు వారాలకు డబ్బింగ్ చేసి బాలీవుడ్ లో వదిలారు. టాలీవుడ్ జనాలను ఆకట్టుకున్న ఈ కంటెంట్, నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్ట్రెయిట్ హిందీ మూవీతోనే బాలీవుడ్ ను టార్గెట్ చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఛత్రపతి' రీమేక్ తీవ్ర నిరాశ పరిచింది.


ఇలా టాలీవుడ్ టైర్-2 హీరోలందరూ పాన్ ఇండియా మార్కెట్ కోసం ప్రయత్నించారు కానీ, ఏదీ కలిసి రాలేదు. అయినా సరే ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. తమ తదుపరి సినిమాలతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. రవితేజ 'ఈగల్', రామ్ 'డబుల్ ఇస్మార్ట్', నిఖిల్ 'స్వయంభూ', విజయ్ దేవరకొండ 'VD12', నాని 'హాయ్ నాన్న' మరియు 'సరిపోదా శనివారం' సినిమాలని హిందీలోనూ ప్లాన్ చేస్తున్నారు. తేజ సజ్జా 'హనుమాన్', నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' చిత్రాలని కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. మరి వీటిల్లో ఏవేవి నార్త్ ఆడియన్స్ ను మెప్పిస్తాయో, ఎవరెవరు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి.