Actor Malvi Malhotra Reacts As Attacker Gets Jailed: ముంబైలో మూడేళ్ల క్రితం సినీ నటి మాల్వీ మల్హోత్రాపై దాడి జరిగిన కేసులో న్యాయస్థానం తుది తీర్పు వెల్లడించింది. తన ప్రేమను నిరాకరించిందంటూ ఓ నిర్మాత ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలతో బయటపడింది. ఈ కేసులో తాజాగా న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. నిందితుడిని దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు పట్ల మాల్వీ సంతోషం వ్యక్తం చేసింది. న్యాయం గెలిచిందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది.


అసలు ఇంతకీ ఏం జరిగిందంటే?


2020లో నటి మాల్వీ మల్హోత్రాతో నిర్మాత యోగేష్ సింగ్ (Yogesh Singh Producer)కు పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులు ఫ్రెండ్లీగా ఉన్నారు. అదే చనువుతో తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. తనకు ఆ ఉద్దేశం లేదని మాల్వీ చెప్పింది. అయినా, అతడు పెళ్లి చేసుకోవాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేశాడు. నెమ్మదిగా ఆమె అతడిని దూరం పెట్టింది. పెళ్లికి ఒప్పుకోవడం లేదని కోపం పెంచుకున్న యోగేష్, ఓ రోజు రాత్రి ముంబైలోని ఓ కేఫ్ దగ్గర మాల్వీని అడ్డుకున్నాడు. తనను ఎందుకు దూరం పెడుతున్నావ్? అంటూ గొడవకు దిగాడు. అతడిని పక్కకు నెట్టేసి వెళ్లడంతో యోగేష్ కు కోపం కట్టలు తెంచుకుంది. తనతో  తెచ్చుకున్న కత్తితో ఆమె పొట్టతో పాటు చేతుల మీద పొడిచాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమె స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. యోగేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 4 సంవత్సరాల తర్వాత ముంబై న్యాయస్థానం మాల్వీకి అనుకూలంగా తీర్పు చెప్పింది.


న్యాయం జరిగింది - మాల్వీ మల్హోత్రా


కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించడం పట్ల మాల్వీ మల్హోత్రా సంతోషం వ్యక్తం చేసింది. గత నాలుగు సంవత్సరాలుగా చేస్తున్న న్యాయపోరాటం గెలిచిందన్నారు. ఈ కేసు విచారణలో ఎన్నో ఒత్తిళ్లు, ఆటంకాలు ఎదురైనా, ఎట్టకేలకు న్యాయం జరిగిందన్నారు. “నవ రాత్రులు న్యాయం, సత్యం, విజయానికి గుర్తులు. జీవితంలో ఎప్పటికైనా న్యాయం అనేదే విజయం సాధిస్తుంది. నా కేసులో న్యాయం జరిగే వరకు పోరాడే శక్తిని ఇచ్చిన అమ్మవారికి ధన్యవాదాలు” అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. తనపై దాడి తర్వాత మానసికంగా కుంగిపోయినట్లు మాల్వీ వెల్లడించింది. “నాపై దాడి తర్వాత జీవితాన్ని భయంతో ముందుకు తీసుకెళ్తున్నాను. మానసిక ఆవేదన అనుభవించాను. శరీరం మీద ఉన్న గాయాల కంటే మానసికంగా అయిన గాయాలు మర్చిపోలేను. దాడి తర్వాత కూడా నన్ను ఎవరో వెంబడిస్తున్న ఫీలింగ్ కలిగేది. నన్ను వెన్నుతట్టి ముందుకు నడిపిస్తున్న మా నాన్న రుణం తీర్చుకోలేనిది. ఆయన నాలో నిరంతరం ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు” అని వెల్లడించింది.   






రాజ్ తరుణ్ వివాదంతో మాల్వీకి గుర్తింపు


‘తిరగబడరా సామీ’ సినిమాతో మాల్వీ మల్హోత్రా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా, రాజ్ తరుణ్ తో ప్రేమాయణం కొనసాగిస్తుందంటూ లావణ్య అనే అమ్మాయి ఆరోపణలు చేయడంతో బాగా పాపులర్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయం నుంచే రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని ఆరోపించింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య కేసు పెట్టడం టాలీవుడ్ లో సంచలనం కలిగించింది.  


Read Also: అమితాబ్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయితే రజనీది లాస్ట్ బెంచ్ ‌- వేట్టయన్ దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్