Vishwak Sen: టాలీవుడ్ లో ఉన్న విలక్షణమైన నటుల్లో యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒకరు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఆయన లైఫ్ స్టైల్ కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అయితే కెరీర్ పరంగా తనకు ఎదురయ్యే ఒడిదుడుకులపై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు విశ్వక్. ఇటీవల ఆయన ‘పేకమేడలు’ అనే సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ సినిమా దర్శకుడు గురించి విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. 


అందరికీ నచ్చడానికి నేనేమీ బిర్యానీను కాదు: విశ్వక్ సేన్


‘పేక మేడలు’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ లో విశ్వక్ సేన్ మాట్లాడారు. ఇండస్ట్రీలో తానేమీ పెద్ద హీరోను కాకపోయినా మనకున్న లైఫ్ స్టైల్ వల్ల కొన్నిసార్లు బిజీగా ఉంటామని అన్నారు. ఆ బిజీ షెడ్యూల్ లో కొన్నిసార్లు కథలు వినడం కుదరకపోవచ్చు. అంతే కాకుండా ఒక్కోసారి కథ చెప్పడానికి వచ్చిన వాళ్లను గంటలకొద్ది కూర్చోబెట్టి తర్వాత కథ వినకుండా పంపించే బదులు ముందే వినను అని చెబితే అవతలి వాళ్ల టైమ్ వేస్ట్ అవ్వదు కదా అనే ఉద్దేశంతో ముందే నో చెబుతామని, ఆ మాత్రం దానికి ఫీల్ అయితే తానేమి చేయలేనని అన్నారు. అందరికీ నచ్చడానికి తానేమీ బిర్యానీ కాదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వస్తున్నాయని అందుకే స్పందించాల్సి వచ్చిందన్నారు. సినిమా చేయాలా వద్దా అనేది తన పర్సనల్ చాయిస్సే తప్పా.. బాలేదని కాదని అన్నారు. అయినా తెలుగు సినిమాకు మంచి పేరు వస్తే తాను కూడా అందరిలాగే గర్వపడతానని అన్నారు. ఒక చిన్న సినిమాగా వచ్చిన ఆ సినిమా పెద్ద విజయం సాధిస్తే తనకు సంతోషమేనని చెప్పారు. మన సినిమా హిట్ అయితే తలెత్తుకోవాలి.. తప్పులేదు. అంతే కానీ మన సినిమా బాగా వచ్చిందని ఎవరినో కించపరచడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఆ సినిమా ట్రైలర్ ను డైరెక్టర్స్ గ్రూప్ లో పెట్టినపుడు మొదట బాగుందని చెప్పింది తానేనని, కానీ సడెన్ గా ఇలా ఆరోపణలు చేసేసరికి కొద్దిగా బాధనిపించిందని అన్నారు విశ్వక్. దీంతో విశ్వక్ సేన్ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఇదీ జరిగింది..


‘బేబీ’ సినిమా సక్సెస్ మీట్ లో ఆ సినిమా దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమా కథను ఓ యంగ్ హీరో దగ్గరకు తీసుకెళ్తే.. ఆ దర్శకుడు ఆయనే కదా.. కథ కూడా వినను అని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ హీరో ఎవరా అని అందరూ ఆరా తీశారు. ఈ ఘటన కొన్ని రోజుల తర్వాత హీరో విశ్వక్ సేన్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇందులో ‘‘వద్దు అంటే వద్దు అనేది మగాళ్లకు కూడా వర్తిస్తుంది. అందుకే హైరానా పడిపోకండి, శాంతియుతంగా ఉండండి. మనం ప్రశాంత వాతావరణంలో బ్రతుకుతున్నాం’’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ ను ఉద్దేశించే చేశారు అనుకున్నారు అంతా. అయితే దీనిపై సాయి రాజేష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఈ వివాదం సద్దుమనిగింది అనుకున్నారు. మళ్లీ విశ్వక్ సేన్ సినిమా పంక్షన్ వేదికపై నుంచి ఇలా మాట్లాడం మరోసారి చర్చలకు దారితీసింది. మరి దీనిపై ‘బేబీ’ దర్శకుడు స్పందిస్తారో లేదో చూడాలి. 


Also Read: మెషిన్స్‌ను నమ్ము, అవి నిన్ను ఎప్పుడూ మోసం చేయవు - ఆసక్తికరంగా శ్రీసింహ ‘ఉస్తాద్’ ట్రైలర్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial