టాలీవుడ్లో విభిన్న తరహా సినిమాలతో హీరోగా ఆకట్టుకోవడంతోపాటు అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర కలర్స్ స్వాతి తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'మంత్ ఆఫ్ మధు'(Month Of Madhu). చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కలర్స్ స్వాతి ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. గతంలో నవీన్ చంద్ర, స్వాతి కాంబినేషన్లో 'త్రిపుర' అనే మూవీ వచ్చింది. ఆ మూవీ తర్వాత మరోసారి వీరిద్దరూ జంటగా వెండితెరపై ప్రేక్షకులను అలరించబోతున్నారు.


ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ని అందుకుంది. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో మూవీ టీం తెగ బిజీగా ఉంది. ముఖ్యంగా నవీన్ చంద్ర, స్వాతి వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా, ఇందులో నవీన్ చంద్ర 'మంత్ అఫ్ మధు' మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కథ వినకుండానే నటించానని నవీన్ చంద్ర ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.


" డైరెక్టర్ శ్రీకాంత్ రైటింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికంటే ముందు చేసిన భానుమతి రామకృష్ణ స్టోరీని కూడా నాకు చాలా సింపుల్ గా చెప్పారు. ఒకరోజు కారులో కూర్చున్నప్పుడు సినిమా గురించి ఒక పాయింట్ మాత్రమే చెప్పారు. మొత్తం కథ తెలియదు. కానీ పాయింట్ నచ్చి సినిమా చేసేసాను. 'మంత్ ఆఫ్ మధు' కూడా అంతే. శ్రీకాంత్ ని నేనే అడిగాను. నెక్స్ట్ ఏంటి బ్రో అని, అప్పుడు అతను ఒకటి అనుకుంటున్నా అని అన్నాడు. అదేంటో చెప్పమని అడిగితే లైన్ చెప్పాడు. చెప్పిన వెంటనే ఇది బాగుంది కదా, మనం ఎందుకు దీని చేయకూడదు అని అన్నాను. ఆ మరుసటి రోజు ఒక మీటింగ్ జరిగింది. ఓకే అనుకున్నాం, మూవీ స్టార్ట్ అయిపోయింది. మొత్తం కథ నాకు షూటింగ్ తర్వాత తెలిసింది. కథ మొత్తం ఇలా ఉంటుంది, ఈ సీన్ ఇలా ఉంటుంది అని తర్వాత చెప్పాడు" అంటూ నవీన్ చంద్ర తెలిపారు.


ఆ తర్వాత స్వాతి మాట్లాడుతూ.." నవీన్ కే కాదు ఎవరికి ఏం చెప్పలేదు. అంతేకాదు ఇప్పటివరకు మేము సినిమా కూడా చూడలేదు. డబ్బింగ్ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే సినిమా మొత్తం సింక్ సౌండ్ తోనే ఉంటుంది. సినిమా మీద నమ్మకం తోటే కష్టపడ్డాం" అని స్వాతి పేర్కొంది. ఆ తర్వాత.." డైరెక్టర్ శ్రీకాంత్ కనీసం షూటింగ్లో ముందు ఎవరికీ డైలాగ్స్ కూడా చెప్పలేదు. ప్రేమ్ రెడీ అయ్యాక ఆన్ ది స్పాట్ ఇలా చేయాలి, ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అని చెబుతారు మేం చేసేస్తాం" అంటూ తాజా ఇంటర్వ్యూలో మూవీ టీమ్ డైరెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. భానుమతి రామకృష్ణ మూవీ ఫేమ్ శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంజుల ఘట్టమనేని, హర్ష చెముడు, జ్ఞానేశ్వరి కండ్రిగులా, శ్రేయ నవేలి సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ చిత్రానికి రాజీవ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.


Also Read : తెలుగు హీరోల్లో నాకున్న ఒక ఒక్క ఫ్రెండ్ బాలకృష్ణ మాత్రమే, తమిళంలో ఎవరు క్లోజ్ అంటే : దగ్గుబాటి రాజా





Join Us on Telegram: https://t.me/abpdesamofficial