Aamir Khan About Namste: సీనియర్ హీరో అమీర్ ఖాన్‌కు ఎక్కువగా ఇంటర్వ్యూలలో పాల్గొనే అలవాటు లేదు. ఎప్పుడో ఒకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తన పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక మొదటిసారి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో గెస్ట్‌గా వచ్చాడు అమీర్ ఖాన్. ఇందులో ఎన్నో ఆసక్తికర అంశాలను కపిల్ శర్మతో పాటు ప్రేక్షకులతో కూడా పంచుకున్నాడు అమీర్. యాక్టింగ్ కెరీర్ గురించి కూడా ఎన్నో విషయాలను పంచుకున్నాడు. పంజాబ్ ప్రేక్షకులు ‘నమస్తే’ అనేది ఎంత పవర్‌ఫుల్ అని తనకు నేర్పించారని గుర్తుచేసుకున్నాడు.


డిస్టర్బ్ చేసేవారు కాదు..


‘‘ఈ కథ నా మనసుకు చాలా దగ్గరయ్యింది. పంజాబ్‌లో ‘రంగ్ దే బసంతి’ సినిమా షూటింగ్ చేశాం. అప్పుడే నాకు అక్కడ మనుషులు చాలా నచ్చేశారు. అక్కడి మనుషులు, పంజాబీ కల్చర్‌లో మొత్తం ప్రేమే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ దంగల్ షూటింగ్ కోసం అక్కడికి వెళ్లాను. షూటింగ్ ఒక చిన్న ఊరిలో జరుగుతోంది. దాదాపు రెండు నెలలపైన ఒకే ఇంట్లో, ఒకే ఊరిలో షూటింగ్ చేశాం. చెప్తే నమ్మరు.. నేను ఉదయం 5, 6 గంటలకు అక్కడికి రీచ్ అయ్యే సమయానికి జనాలంతా వారి ఇళ్లల్లో నుండి బయటికొచ్చి చేతులు జోడించి ‘సత్ శ్రీ ఆకాల్’ అని విష్ చేసేవారు. వారంతా నన్ను అలా వెల్‌కమ్ చేసేవాళ్లు. వాళ్లు నా కార్ ఆపడం గానీ, నన్ను డిస్టర్బ్ చేయడం గానీ చేసేవారు కాదు. మళ్లీ షూటింగ్ ముగొంచుకొని ప్యాకప్ అయిపోయి వెళ్లేసరికి మళ్లీ అలాగే నిలబడి గుడ్ నైట్ చెప్పేవాళ్లు’’ అని గుర్తుచేసుకున్నాడు అమీర్ ఖాన్.


అప్పుడే తెలిసింది..


ఒక ముస్లిం అయినా కూడా తనకు చేతులు జోడించి, అందరినీ నమస్తే అని పలకరించడం అలవాటని బయటపెట్టాడు అమీర్ ఖాన్. ‘‘నేను ఒక ముస్లిం కుటుంబానికి చెందినవాడిని. ఒకప్పుడు చేతులు జోడించి నమస్తే చెప్పడం నాకు అలవాటు లేదు. నాకు చేయి ఎత్తి, తల వంచి ‘ఆదాబ్’ అనే అలవాటు మాత్రమే ఉండేది. దంగల్ కోసం రెండున్నర నెలలు పంజాబ్‌లో ఉన్న తర్వాత నమస్తే పవర్ ఏంటో నాకు అర్థమయ్యింది. అది ఒక అద్భుతమైన ఎమోషన్. పంజాబ్ మనుషులు స్టేటస్‌ను చూసి ఎవరినీ గౌరవించరు, వాళ్లు అందరినీ సమానంగా చూస్తారు’’ అంటూ పంజాబ్ ప్రజలపై ప్రశంసలు కురిపించాడు అమీర్ ఖాన్.


సినిమాలు తగ్గిపోయాయి..


సినిమాల విషయానికొస్తే.. కోవిడ్ తర్వాత సినిమాలు చేసే విషయంలో స్పీడ్ తగ్గించాడు అమీర్ ఖాన్. యాక్టర్‌గా కంటే ఎక్కువగా నిర్మాతగానే యాక్టివ్‌గా ఉంటున్నాడు అమీర్. తను చివరిగా 2022లో విడుదలయిన ‘లాల్ సింగ్ చడ్డా’లో హీరోగా కనిపించాడు. ఆ తర్వాత కాజల్ హీరోయిన్‌గా నటించిన ‘సలామ్ వెంకీ’లో గెస్ట్ రోల్‌లో అలరించాడు. త్వరలోనే అమీర్ ఖాన్, సన్నీ డియోల్ కలిసి ‘లాహోర్ 1947’లో మల్టీ స్టారర్‌లో నటించనున్నారు. ఈ సినిమాను రాజ్‌కుమార్ సంతోషితో దర్శకత్వం వహించగా.. అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. తాజాగా తన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’కు కూడా నిర్మాతగా వ్యవహరించాడు అమీర్ ఖాన్.



Also Read: ఓటీటీల్లో సందడి చేసే వెబ్ సిరీస్, సినిమాలు - ఈ వారం వచ్చేవి ఏవో తెలుసా?