Aa Rojulu Malli Raavu Song From Committee Kurrollu Is Out Now: మెగా వారసురాలు నిహారిక కొణిదెల ఇప్పటికే హీరోయిన్‌గా పలు సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు సాధించుకుంది. ఇప్పుడు పూర్తిగా ప్రొడక్షన్‌లో బిజీ అయిపోవాలని చూస్తోంది. తన సొంత బ్యానర్ అయిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది నిహారిక కొణిదెల. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదలయ్యి ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని అందరికీ తెలిసేలా చేశాయి. ఇప్పుడు ఈ సినిమా నుండి ఒక పాట కూడా విడుదలయ్యి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.


90స్ కిడ్స్ కనెక్ట్ అయ్యే పాట


‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ కోసం సింగర్ అనుదీప్ దేవ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా మారాడు. తన మ్యూజిక్ డైరెక్షన్‌లో కార్తిక్ ఆలపించిన ‘ఆ రోజులు మళ్లీ రావు’ అనే పాట తాజాగా విడుదలయ్యింది. డ్యాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్.. ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు 90స్ కిడ్స్ అంతా బాగా కనెక్ట్ అవుతారు. తమ బాల్యాన్ని గుర్తుచేస్తూ ఎమోషనల్ ఫీల్ అయ్యేలా చేస్తుంది ఈ పాట. ‘ఆ రోజులు మళ్లీ రావు’ లిరికల్ వీడియోలో కూడా 90స్ కిడ్స్ కనెక్ట్ అయ్యే ఎన్నో అంశాలను చేర్చారు మేకర్స్. సమ్మర్ హాలీడేస్ వస్తే క్రికెట్ ఆడడం, పాటల పుస్తకాలు కొనడం, టీవీలో అందరూ కలిసి పంచతంత్రం చూడడం... ఇలాంటి ఎన్నో వింటేజ్ జ్ఞాపకాలు ఈ లిరికల్ వీడియోలో ఉన్నాయి.


హీరో హీరోయిన్లు అందరూ కొత్తవాళ్లే


‘ఆ రోజులు మళ్లీ రావు’ లాంటి పాటకు కార్తీక్ వాయిస్ ప్రాణం పోసినట్టుగా ఉందని, తన వాయిస్‌తో పాటను వింటుంటే మరింత ఎమోషనల్ ఫీల్ వస్తుందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలను అందిస్తున్నారు. ఇక ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీతో 11 మంది హీరోలను, నలుగురు హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేయనుంది నిహారిక కొణిదెల. ఇందులో చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో నిహారికకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే అందులో కొందరిని తను సమర్పిస్తున్న సినిమాలో మెయిన్ లీడ్స్‌గా తీసుకుంది.



ఈ సినిమాపై యూత్‌లో ఆసక్తి


‘కమిటీ కుర్రోళ్లు’ అనే టైటిల్‌తోనే యూత్‌లో ఆసక్తిని క్రియేట్ చేసింది ఈ చిత్రం. ఇక తాజాగా విడుదలయిన ‘ఆ రోజులు మళ్లీ రావు’ పాట వింటుంటే కచ్చితంగా ఇది చాలామందిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌తో కలిసి ఈ మూవీని నిర్మిస్తోంది నిహారిక కొణిదెల. ‘కమిటీ కుర్రోళ్లు’ ద్వారా యదు వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇందులో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.



Also Read: కోలీవుడ్ సూపర్ హిట్ సీక్వెల్‌లో త్రిష - 'అమ్మోరు తల్లి'గా గ్లామర్ క్వీన్?