రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా ఇది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుగు ట్రైలర్ కి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో దర్శకధీరుడు రాజమౌళి భాగస్వామిగా ఉన్నారు. దీంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. 


నిజానికి 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని బాలీవుడ్ భావించింది. కానీ ట్రైలర్ చూసిన తరువాత అంచనాలు తారుమారయ్యాయి. ట్రైలర్ మొత్తాన్ని గ్రాఫిక్స్ తో నింపేశారు. అయితే వీఎఫ్ఎక్స్ నాశిరకంగా ఉంది. దీనికంటే సీరియల్స్ లో వీఎఫ్ఎక్స్ బెటర్ గా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ పరంగా ఈ సినిమా తేలిపోయింది. 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ చూసిన వారంతా.. 'ఆదిపురుష్'పై బెంగ పెట్టుకుంటున్నారు. 


ప్రభాస్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ చాలా కీలకం. సినిమాలో ఎనభై నుంచి తొంబై శాతం సన్నివేశాలను వీఎఫ్ఎక్స్ లోనే చేయాలి. 'బ్రహ్మాస్త్ర' సినిమాకి పని చేసిన వీఎఫ్ఎక్స్ స్టూడియోలో 'ఆదిపురుష్' సినిమాకి కూడా పని చేస్తున్నాయి. ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతోంది. 'బ్రహ్మాస్త్ర'లానే 'ఆదిపురుష్' గ్రాఫిక్స్ కూడా ఉంటాయేమోనని కంగారు పడుతున్నారు అభిమానులు. 


అయితే 'ఆదిపురుష్' సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉంది. కాబట్టి గ్రాఫిక్స్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకునే ఛాన్స్ ఉంది. 'బ్రహ్మాస్త్ర' మాదిరి 'ఆదిపురుష్' గ్రాఫిక్స్ ఉంటే మాత్రం కష్టమే. అందుకే రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయన దగ్గరుండి మరీ డిజైన్ చేయించుకుంటూ ఉంటారు. 'బ్రహ్మాస్త్ర' సినిమా విషయంలో కూడా రాజమౌళి సలహాలు ఇచ్చారు కానీ గ్రాఫిక్స్ విషయంలో తేడా కొట్టిందనే చెప్పాలి. 


Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?


Also Read : తక్కువ అంచనా వేయకండి - బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా