‘బిగ్ బాస్’ సీజన్-7లో ఇప్పుడు రెండు గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. కేవలం గౌతమ్ ఒక్కడే ఏ గ్రూపుతో కలవకుండా తన ఆట తాను ఆడుతున్నట్లు కనిపిస్తోంది. శోభాశెట్టి, ప్రియాంక జైన్, ఆట సందీప్, అమర్ దీప్ ఒక గ్రూపుగా ఉన్నారు. మొదట్లో యావర్, పల్లవి ప్రశాంత్ మాత్రమే శివాజీతో ఉండేవారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో శివాజీ గ్రూపు పెద్దదైంది. భోలే షావలి, అశ్వినీ శ్రీ ఇప్పుడు శివాజీ గ్రూప్‌లోనే చేరారు. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రతిక రోజ్ కూడా.. శివాజీకి బయట ఉన్న పాపులారిటీ అంచనా వేసుకుని ఆయన గ్రూపులోనే చేరింది. ఆయనతో ఉంటే సేఫ్‌గా ఉండటమే కాకుండా.. తాను నామినేషన్స్‌లోకి వెళ్లినప్పుడు శివాజీ అభిమానుల ఓట్లు తనకు పడతాయనే లెక్కలతో ఉంది. అందుకే రాగానే.. శివాజీ కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా.. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న శోభాశెట్టి, అమర్‌దీప్‌లను నామినేట్ చూపించి గురుభక్తిని చాటుకుంది. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, భోలే కూడా శివాజీ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటున్నారు. ఆయన్ని ఎవరైనా నామినేట్ చేస్తుంటే.. వారిని టార్గెట్ చేసుకుని రివేంజ్ నామినేషన్స్‌కు ప్లాన్ చేస్తున్నారు. 


ఎమోషనల్ బ్లాక్ మెయిల్?


శివాజీ హౌస్‌లో నిజాయతీగా ఉంటున్నారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయనకు అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే, పక్షపాత వైఖరి వల్లే విమర్శలు వస్తున్నాయి. పైగా యావర్, పల్లవి ప్రశాంత్‌లను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారనే భావన ప్రేక్షకుల్లో కలుగుతోంది. శివాజీ సేవలోమునిగితేలుతున్న ఆ ఇద్దరు.. తమ ఆటను పూర్తిగా పక్కన పెట్టేశారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారిని ఇతర ఇంటి సభ్యులతోనూ కలవనిస్తూ.. ఇండివిడ్యువల్‌గా ఆడేందుకు శివాజీ ప్రోత్సహిస్తే బాగుంటుంది. అప్పుడు ప్రేక్షకుల నుంచి మరిన్ని మంచి మార్కులు కొట్టేయొచ్చు. తాజా నామినేషన్లలో కూడా శివాజీ పరోక్షంగా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్లు కనిపించింది. ఎవరైనా నామినేషన్ చేస్తున్నప్పుడు ‘‘బయట జనాలు చూస్తున్నారు. నువ్వు నా దగ్గర అన్నది ఇక్కడి చెబితే బాగోదు. నేను చెప్పకూడదు’’ అంటూ వాళ్లు ఏదో అనకూడనది అన్నట్లుగా పొట్రైట్ చెయ్యడం చూస్తుంటే.. మైండ్ గేమ్‌లా కనిపిస్తోంది.


‘‘జనాలు చూస్తున్నారమ్మా’’ అంటూ.. వారు తప్పును ఎత్తి చూపే వైనాన్ని హౌస్‌మేట్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాదు.. శివాజీకి ఉన్న ఫాలోయింగ్‌ చూసి ఆయన్ని నామినేట్ చెయ్యాలంటేనే భయపడిపోతున్నారు. కేవలం గౌతమ్ ఒక్కడే ఆయన్ని నామినేట్ చేయడానికి ధైర్యం చేస్తున్నాడు. దీంతో శివాజీ అండ్ గ్యాంగ్‌కు గౌతమ్ టార్గెట్ అయ్యాడు. అలాగే, భోలే-శోభాశెట్టిల మధ్య గొడవ జరిగిన తర్వాత శివాజీ.. అస్సలు స్పందించలేదు. శోభాతో మాట్లాడలేదు. అయితే, నామినేషన్స్‌లో మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించారు. అక్కడ చెప్పిన పాయింట్లు అప్పుడే శోభాశెట్టికి ఎందుకు చెప్పలేదనే సందేహం చాలామందిలో నెలకొంది. మరోవైపు సందీప్, ప్రియాంక, శోభాలు గ్రూపుగా మంతనాలు జరుపుతున్నా. మైండ్ గేమ్‌లో సక్సెస్ కాలేకపోతున్నారు. పదే పదే నోటికి పని చెప్పి.. ప్రేక్షకులకు కూడా తలనొప్పిగా మారుతున్నారు. అమర్ అమాయకత్వం.. అయోమయంతో, గౌతమ్ నోటి దురద.. అనవసర విషయాలతో ఉన్న అభిమానలను దూరం చేసుకుంటున్నారు. తేజా ఒక్కడే ఆ హౌస్‌లో సేఫ్ గేమ్ ఆడుతూ.. వారాలకు వారాలు గడిపేస్తున్నాడు.


ఓవర్ కాన్ఫిడెన్స్


హౌస్‌లో అత్యధిక ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లో శోభాశెట్టి, సందీప్, ప్రియాంకతోపాటు శివాజీ కూడా ఉన్నాడు. అయితే, వారం వారం హోస్ట్ నాగార్జున ఇచ్చే బూస్ట్‌తో శివాజీ మరింత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. సోమవారం నామినేషన్లు పూర్తయిన తర్వాత భోలే.. ఈ వారం తప్పకుండా వెళ్లిపోతానేమో అని శివాజీతో అన్నాడు. ఇందుకు శివాజీ.. ‘‘నిన్ను నేను చూసుకుంటా కదా.. నీతో పాటలు పాడించి పైకి లేపుతా’’ అంటూ ఆయన బాధ్యత తీసుకున్నారు. రైతు బిడ్డ తరహాలోనే పాట బిడ్డను కూడా ప్రొటెక్ట్ చేసే బాధ్యత తీసుకున్నారు. ఇంతకు ముందు ఆయన నామినేషన్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘దొంగ దొంగ అని పరిగెట్టిస్తున్నారే. చూస్తా.. ఇప్పుడైనా జనాలు, ప్రజలు అనేవాళ్లు ఉంటే.. ఈ వారం చూస్తా. లేదా వాలంటరీగా ఎవరో ఒకరిని కొట్టి వెళ్లిపోతా’’ అని అన్నాడు. ఇంతలో రతిక కలుగజేసుకుని ‘‘అలా అనొద్దు అన్నా’’ అన్నట్లుగా శివాజీని వారించే ప్రయత్నం చేసింది. ‘‘వారి వల్ల హౌస్ అంతా డిస్ట్రబ్ అవుతుంటే.. ఇంత అన్యాయమా. ఈ వారం పర్‌ఫెక్ట్‌గా నామినేషన్స్ పడ్డాయి, ఏమవుతుందో చూద్దాం’’ అని శివాజీ పేర్కొన్నాడు. ప్రస్తుతం అమర్‌దీప్, గౌతమ్, శోభాశెట్టి, ప్రియాంకలనే శివాజీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వీళ్లు వాళ్లను, వాళ్లు వీళ్లను నామినేట్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. 


డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు


శోభా శెట్టి, భోలే షావలి, శివాజీ, అశ్వినీ, ప్రియాంక, అమర్ దీప్, సందీప్, గౌతమ్‌లు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో శోభాశెట్టి డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె నామినేషన్స్‌లోకి రావాలని శివాజీ గ్రూప్ అభిమానులు కోరుకుంటున్నారు. శివాజీని నామినేట్ చేసిన అమర్‌దీప్, గౌతమ్‌లకు కూడా ఈ వారం కష్టమే. అయితే, అమర్‌దీప్ సేవ్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే, శివాజీ సపోర్ట్ కలిగిన భోలే షావలి, అశ్వినీ సేవ్ అయ్యే అవకాశాలున్నా.. సందేహమే. ఎందుకంటే.. వారితో కూడా శివాజీ కూడా నామినేషన్స్‌లో ఉన్నాడు. దీంతో శివాజీ అభిమానులు భోలే, అశ్వినీలను కాపాడటం కష్టమే. అలాగే, ఆట సందీప్ ఫస్ట్ టైమ్ నామినేషన్స్‌లోకి వచ్చాడు. అతడు కూడా సేవ్ అవ్వడం కష్టమే. మరి, వీరిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు. 


Also Read: తేజా, అశ్వినీ ఫైట్ - పాపం, మధ్యలో భోలే షావలి పరువు తీసేశారు, చివరికి...


గమనిక: ప్రేక్షకుల అభిప్రాయాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.