‘బిగ్ బాస్’ హౌజ్‌లో జరిగే గొడవలు, కాంట్రవర్సీలు మాత్రమే కాదు.. ప్రేమకథలు కూడా చాలా ఫేమస్. ఇప్పటివరకు జరిగిన ప్రతీ ‘బిగ్ బాస్’ సీజన్‌లో ఒక ప్రేమజంట ఉన్నారు. ఒక్కొక్క సీజన్‌లో అయితే రెండు, మూడు ప్రేమజంటలు కూడా ఉన్నాయి. ఇక ‘బిగ్ బాస్’ సీజన్ 7 ప్రారంభం అయినప్పటి నుంచి ఎక్కువగా జూనియర్సే ఉన్నారు. అంటే అందరూ దాదాపు ఒకే వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. ఈసారి ఏ ఇద్దరు కనెక్ట్ అవుతారా అని ప్రేక్షకులు మొదటిరోజు నుండే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ.. హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే శుభశ్రీని క్యూట్‌గా ఉన్నావంటూ సంకెళ్లతో బంధించాడు. దీంతో ‘బిగ్ బాస్’ సీజన్ 7 కపుల్ వీరే అని ప్రేక్షకులు అనుకున్నారు. ఇంతలో మధ్యలోకి శోభా శెట్టి వచ్చింది. దీంతో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయిపోయింది.


గౌతమ్, శుభశ్రీ.. మధ్యలో శోభా శెట్టి..
‘బిగ్ బాస్’ సీజన్ 7 లాంచ్ డే నుంచే అందరి దృష్టిని ఆకర్షించిన కపుల్ గౌతమ్ కృష్ణ, శుభశ్రీ. వీరిద్దరూ హౌజ్‌లోకి ఎంటర్ అయినప్పటి నుండే సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు. వీరికి ‘బిగ్ బాస్’ ప్రారంభం కాకముందు నుంచి పరిచయం లేకపోయినా.. హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే వెంటనే క్లోజ్ అయిపోయారు. దీంతో ఈ సీజన్‌కు సంబంధించిన కపుల్ వీరే అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. ఇంతలో శోభా శెట్టి.. గౌతమ్ కృష్ణను నామినేట్ చేసింది. అక్కడ నుంచి కథ కాస్త మలుపు తిరిగింది. మేడమ్ అని పిలవద్దని, నాతో తప్పా అందరితో బాగా మాట్లాడుతున్నావు అని శోభా శెట్టి.. గౌతమ్‌పై ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. దీంతో గౌతమ్.. శుభశ్రీని పక్కన పెట్టి శోభా శెట్టితో ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు. శుభశ్రీ, శోభా శెట్టి కూడా బాగానే కలిసిపోయారు అన్నట్టుగా ప్రేక్షకులకు అనిపించింది.


టేస్టీ తేజ పెట్టిన చిచ్చు..
తాజాగా ‘బిగ్ బాస్’.. షకీలా, టేస్టీ తేజను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి హౌజ్‌లోని గాసిప్‌ను చెప్పమన్నాడు. ఆ ఇద్దరూ గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి మధ్య ఏదో ఉందని అనిపిస్తుందని చెప్పారు. ఆ తర్వాత కన్ఫెషన్ రూమ్ నుంచి బయటికి వచ్చిన తేజ.. ఇదే విషయాన్ని శుభశ్రీకి చెప్పాడు. అప్పటినుంచి శుభశ్రీ.. గౌతమ్‌ను దూరం పెట్టడంతో పాటు తేజతో క్లోజ్‌గా ఉండడం మొదలుపెట్టింది. అంతే కాకుండా తాజాగా విడుదలయిన ప్రోమోలో తేజ, శుభశ్రీ కలిసి డ్యాన్స్ కూడా చేశారు. అది చూసిన గౌతమ్.. శుభశ్రీతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ‘నేను తనతో డ్యాన్స్ చేస్తే నిన్ను అవమానించినట్టు ఎలా అవుతుంది’ అంటూ గౌతమ్‌కు కనీసం మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు శుభశ్రీ. ఇదంతా టేస్టీ తేజ నోటి దురద వల్లే అని అంటున్నారు ప్రేక్షకులు.


నీకు నచ్చినట్టు ఉండు..
మామూలుగా గౌతమ్ కృష్ణతో తప్పా మిగతా కంటెస్టెంట్స్‌తో ఎక్కువగా మాట్లాడని శుభశ్రీ.. వీరిద్దరి మధ్య జరిగిన గొడవ గురించి పల్లవి ప్రశాంత్‌కు వెళ్లి చెప్పడం కూడా తాజాగా విడుదలయిన ప్రోమోలో చూపించారు. అప్పుడే గౌతమ్ ఎంటర్ అయ్యి ‘ఏమైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పు’ అన్నాడు. దీంతో పల్లవి ప్రశాంత్.. ‘ముందు మీరిద్దరూ మాట్లాడుకోండి. నేను తర్వాత వస్తాను’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ‘నీకు నాతో కంఫర్ట్ ఉందా లేదా’ అని శుభశ్రీని సూటిగా అడిగేశాడు గౌతమ్. ‘దూరంగా ఉండమంటే దూరంగానే ఉంటాను’ అన్నాడు. ‘నీకు ఎలా ఇష్టమో అలా ఉండు’ అంటూ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది శుభశ్రీ. ఈ విషయంపై గౌతమ్ బాధపడడం గమనించిన శోభా శెట్టి.. ‘నీకు ఫీలింగ్స్ ఉన్నాయా’ అని నేరుగా అడిగింది. ‘ఫీలింగ్స్ కాదు పాజిటివ్ వైబ్స్’ అని క్లారిటీ ఇచ్చాడు గౌతమ్. మరోవైపు శుభశ్రీ.. ఈ విషయాన్ని కంటెస్టెంట్స్ అందరితో చర్చించడం మొదలుపెట్టింది. ‘బిగ్ బాస్’ తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మొత్తం వీరి గురించే చూపించడంతో ప్రేక్షకులు కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.



Also Read: చిత్రసీమలో విషాదం - గుండెపోటుతో 'జైలర్' నటుడు కన్నుమూత


Join Us on Telegram: https://t.me/abpdesamofficial