బిగ్ బాస్ సీజన్ 7(Bigg Boss Teluau Season 7)లో మూడో వారం మొదలయ్యింది. దీంతో మూడో పవర్ అస్త్రాను కంటెస్టెంట్‌లో ఒకరు గెలుచుకోవడానికి పోటీ మొదలయ్యింది. మూడో పవర్ అస్త్రా ఎవరికి వస్తుంది, అసలు గేమ్ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. కానీ ఈసారి పవర్ అస్త్రా కోసం ఎవరు పోటీ పడతారు అనే విషయాన్ని అనూహ్యంగా బిగ్ బాసే డిసైడ్ చేశారు. ఒకవైపు పవర్ అస్త్రా కోసం పోటీ జరుగుతుంటే.. మరోవైపు రతిక, పల్లవి ప్రశాంత్.. ఎప్పటిలాగానే గిల్లికజ్జాలతో, గొడవలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. కొన్నిరోజుల పాటు రతిక, ప్రశాంత్ మధ్య మాటల్లేవు. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ కొన్ని గొడవలు, కొన్ని గిల్లికజ్జాలతో కలిసిపోయారు. కానీ మధ్యలో ప్రిన్స్ యావర్ నలిగిపోయాడు.


మళ్లీ గొడవ..
కంటెస్టెంట్స్ అంతా తనను టార్గెట్ చేసినట్టుగా ఉందంటూ, ఇలా పలు కారణాలు తనకు నచ్చడం లేదంటూ శివాజీతో చెప్పుకొని బాధపడింది రతిక. ఏడ్చింది కూడా. దీంతో పల్లవి ప్రశాంత్.. తనను ఓదార్చడానికి వచ్చాడు. కళ్లలో నుంచి పాదరసం వస్తుంది అంటూ తనను నవ్వించే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అక్కడికి ప్రిన్స్ యావర్ వచ్చాడు. రతిక.. యావర్‌ను మామూలుగా చూడగా.. అసలు యావర్ ఎవరు మన మధ్యలో అంటూ రతితో అన్నాడు. దీంతో తను ఏడుపు ఆపేసి నవ్వింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు.. వీరిద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయి అని అనుకునేలోపే.. మళ్లీ గొడవపడడం మొదలుపెట్టాడు.


నువ్వు పో..
ఒకవైపు మూడో పవర్ అస్త్రా కోసం పోటీ జరుగుతోంది. ఇంతలోనే శివాజీకి చెందిన పవర్ అస్త్రాను అమర్‌దీప్ దొంగిలించాడు. అదే సమయంలో అసలు ఆ పవర్ అస్త్రాను ఎవరు కొట్టేశారని చర్చ మొదలయ్యింది. అందరూ కలిసి చర్చించుకుంటున్న సమయంలో రతిక.. పల్లవి ప్రశాంత్ పేరు చెప్పింది. దీని వల్ల వారి మధ్య గొడవ మొదలయ్యింది. పల్లవి ప్రశాంత్ అన్న మాటలకు ఓవరాక్షన్ చేయకు అంటూ అరిచింది రతిక. దీనికి సహనం కోల్పోయిన ప్రశాంత్.. ‘‘అటు పో’’ అంటూ చులకనగా చూశాడు. ఒకరికి ఒకరు బాగా ఎక్కువ చేస్తున్నావు, తగ్గించు అంటూ వాగ్వాదాలు చేసుకున్నారు. అసలు వీరిద్దరు అంతలా ఎందుకు కొట్టుకుంటున్నారు అని ఇతర కంటెస్టెంట్స్‌కు అర్థం కాలేదు. శుభశ్రీ.. రతికతో ఎవరో ఒకరు గొడవపెట్టుకోవాలి అనే టాస్క్ ఇచ్చిందని, తాను చేయలేదని తేజ బయటపెట్టాడు. 


చేయి వేయకు..
నేడు (సెప్టెంబర్ 19న) ప్రసారం అయిన ఎపిసోడ్‌లో రతిక, ప్రశాంత్‌ల మధ్య ఒక్కసారి కాదు.. పదేపదే గొడవ జరిగింది. పల్లవి ప్రశాంత్ లివింగ్ రూమ్‌లోని సోఫాలో కూర్చొని ఉండగా.. రతిక.. అక్కడికే వచ్చి నిలబడింది. ఇక్కడికి ఎందుకు వచ్చి నిలబడ్డావు అని ప్రశాంత్ అడగడంతో.. వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలయ్యింది. ‘‘నేను ఎక్కడైనా నిలబడతా.. నా ఇష్టం’’ అని రతిక అరవడం మొదలుపెట్టింది. మళ్లీ కాసేపు నువ్వు పో అంటే నువ్వు పో అంటూ వాదించుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్లిపో అంటూ రతికపై చేయి వేసి మరీ చెప్పాడు ప్రశాంత్. అది నచ్చని రతిక.. నువ్వు చేయి వేసి మాట్లాడకు అంటూ బెదిరించడం మొదలుపెట్టింది. వాగ్వాదం చాలు అనుకున్న ప్రశాంత్.. అక్కడ నుంచి లేచి వెళ్లిపోయాడు. వీరిద్దరూ కెమెరాల్లో పడడానికే ఇలా కావాలని గొడవపడుతున్నారని కంటెస్టెంట్స్ అనుకోవడం మొదలుపెట్టారు. ప్రశాంత్‌తో గొడవపడుతూ యావర్‌కు దగ్గరయిన రతిక.. అతడు పవర్ అస్త్రాకు అర్హుడు కాదు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో యావర్.. రతిక దగ్గర నుంచి ఇది ఊహించలేదు అంటూ బాధపడ్డాడు. దీనికి ప్రేక్షకులు వెన్నుపోటు అని ముద్రవేశారు.


Also Read: తను నన్ను చిన్నపిల్లాడిలా చూసుకుంటుంది: భార్య, పిల్లల గురించి విజయ్ ఆంటోనీ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial