కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పీఏ సందీప్ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై మీరట్ పోలీసులు కేసుల నమోదు చేశారు. తన కూతురును కులం పేరుతో దూషించడంతో పాటు చంపుతానని బెదిరించినట్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్చన గౌతమ్ తండ్రి ఆరోపించారు. పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.

    


ఇంతకీ ఏం జరిగిందంటే?


ప్రియాంక గాంధీ ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 26న ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో కాంగ్రెస్‌ జనరల్‌ కన్వెన్షన్‌లోని ప్లీనరీ సమావేశానికి హాజరయ్యేందుకు అర్చన గౌతమ్ వెళ్లింది. అక్కడ ప్రియాంకను పరిచయం చేసుకునేందుకు అర్చన ప్రయత్నించింది. కానీ, ఆమె పీఏ తనకు అడ్డు పడ్డాడు. ప్రియాంక దగ్గరికి వెళ్లేందుకు అనుమతించాలని కోరడంతో తను తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డట్లు వెల్లడించింది. అసభ్యంగా తిట్టడంతో పాటు చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది. తాజాగా ఈ విషయాన్ని తన తండ్రి గౌతమ్‌ బుద్ధ్‌ కు చెప్పింది. వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురుకు జరిగిన అవమానాన్ని వివరించాడు. తన కుమార్తెను ప్రియాంక పీఏ సందీప్ కులం పేరుతో దూషించాడని గౌతమ్ ఫిర్యాదు చేశారు. చంపుతానని బెదిరించినట్లు కంప్లైంట్ లో పేర్కొన్నారు.


పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు


అర్చనా తండ్రి గౌతమ్‌ బుద్ధ్‌ ఫిర్యాదుతో మీరట్ పోలీసులు సందీప్ సింగ్‌పై పార్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 504, 506, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందంతో ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. అర్చన గౌతమ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మీరట్ సిటీ ఎస్పీ పీయూష్ సింగ్ తెలిపారు. స్పెషల్ టీమ్ తో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.  త్వరలో ప్రియాంక గాంధీ పీఏను విచారణకు పిలవనున్నట్లు పేర్కొన్నారు. 


ఫేస్ బుక్ లైవ్ ద్వారా జరిగిన విషయాన్ని వెల్లడించిన అర్చన


తాజాగా ఈ విషయాన్ని అర్చన గౌతమ్ స్వయంగా ఫేస్‌బుక్ లైవ్‌ ద్వారా వివరించింది. రాయ్‌పూర్‌ మీటింగ్ లో ప్రియాంక పీఏ సందీప్ సింగ్ అత్యంత దారుణంగా వ్యవహరించాడని చెప్పుకొచ్చింది. తనను లోపలికి వెళ్లనివ్వలేదని, కులం పేరుతో అసభ్యంగా దూషించాడని చెప్పింది. అంతేకాదు, చంపేస్తానంటూ దారుణంగా బెదిరించాడని చెప్పింది. తనతో పాటు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను ఆయన ఇలాగే బెదిరిస్తున్నాడని ఆరోపించింది.  ఆయన విషయంలో ప్రియాంక గాంధీ సైతం తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది. 



హిందీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 16లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అర్చనా గౌతమ్ టాప్ 5 ఫైనలిస్టుల జాబితాలో నిలవడం గమనార్హం. ఈ షోలో భాగంగా శివ్ ఠాకరేతో గొడవ పడింది. దీంతో ఆమెను బిగ్ బాస్ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత సల్మాన్‌ ఖాన్‌ ఆమెను బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకొచ్చారు. అనంతరం చక్కటి ఆట తీరుతో ప్రేక్షకులను అలరించింది. 


Read Also: ‘బాహుబలి’ ఆడిషన్‌లో రాశీ ఖన్నా - రాజమౌళికి నచ్చినా, ఆ కారణంతో ఛాన్స్ ఇవ్వలేదట!