‘బిగ్ బాస్’లో ఈ వారం హౌస్‌లో కెప్టెన్ స్థానం కోసం పోటీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కెప్టెన్సీ పోటీదారులుగా రవి, జెస్సి, శ్వేతావర్మ, శ్రీరామచంద్ర ఎంపికైనట్లు గురువారం విడుదల చేసిన మొదటి ప్రోమోలో చూపించారు. ఈ నలుగురు స్విమ్మింగ్ పూల్ నుంచి కెప్టెన్ అనే ఇంగ్లీష్ లెటర్స్‌ని తీసుకుని పేర్చే విధంగా ‘స్విమ్ జర స్విమ్’ టాస్క్‌లో పాల్గొన్నారు. 


అయితే, మధ్యాహ్నం విడుదల చేసిన రెండో ప్రోమోలో మాత్రం.. కెప్టెన్ ఎవరనేది లీకైపోయింది. బిగ్‌బాస్‌ను గమనించే ప్రేక్షకులు వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ తీసి.. ఇదిగో ఇతడే కెప్టెన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మొదలుపెట్టారు. ఇంతకీ కెప్టెన్ ఎవరయ్యరో మీకు తెలుసుకోవాలని ఉందా? మరెవ్వరో కాదు.. జెస్సీ. ఫస్ట్ లవ్ గురించి బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో జస్సీ బెలూన్ పట్టుకున్నప్పుడు, సోఫాలో లోబో, సిరిలతో కూర్చున్నప్పుడు జెస్సీ కుడి చేతికి కెప్టెన్సీ బాండ్ కనిపించింది. దీంతో అంతా జస్సీ కెప్టెన్ అయ్యాడని డిసైడ్ అయిపోయారు. ప్రోమో ఎడిట్ చేసినవారు.. ఈ చిన్న విషయాన్ని ఎలా మరిపోయారో అంటూ నెటిజనులు చలోక్తులు విసురుతున్నారు. 


పాత సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్ 5’ సీజన్ మొదటి ఎసిపోడ్ నుంచే సందడి మొదలైంది. మొదటి వారమే గొడవలు, అరుపులు ప్రారంభమైపోయాయి. తాజాగా నేటి ఎపిసోడ్‌‌కు సంబంధించి రెండో ప్రోమో విడుదలైంది. అందులో హౌస్ మేట్లు తమ తొలి ప్రేమను గుర్తు తెచ్చుకుని, వారి గుర్తుగా ఒక ఎర్రటి బెలూన్ పైకొదలాలి. ఆ బెలూన్ పై వారి పేర్లు కూడా రాయాలి. ప్రోమోను బట్టి చూస్తే తొలి ప్రేమ అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. 






జీవితమనే ప్రయాణంలో ఎందరిని కలిసినా తొలి ప్రేమ ఇచ్చే మధుర అనుభవాలు, నేర్పే గుణపాఠాలు మళ్లీ మళ్లీ దక్కవు అంటూ రెండో ప్రోమోను ప్రారంభించి అందరినీ తొలిప్రేమ జ్ఞాపకాల్లో తడిసి ముద్దయ్యేలా చేశాడు బిగ్ బాస్. శ్రీరామ చంద్ర తన తొలిప్రేమ గురించి చెబుతూ ఆ అమ్మాయికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని కాసేపు నవ్వించాడు. సన్నీ కూడా తన పదోతరగతి ప్రేమను గుర్తు చేసుకున్నాడు. షన్ను తన ఫస్ట్ దీపూనేనని, ఆ విషయం ఆమెకు కూడా తెలిసని అన్నాడు. షన్ను ప్రేయసి దీప్తి సునయన గతంలో బిగ్ బాస్ లో పాల్గొంది. జెస్సీ బెలూన్ పై ఒక అమ్మాయి పేరు రాసి ‘నువ్వు సింగిల్ అయితే, నేను రెడీ టు మింగిల్’ అని సిగ్నల్ ఇచ్చాడు. 






అన్నింటి కన్నా ప్రియా చెప్పిన మాటలే ప్రోమోకి హైలైట్ గా నిలిచాయి. నిజానికి ప్రియకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అందులో పాప గతేడాదే మరణించింది. టీనేజీ వయసున్న కొడుకు ఉన్నాడు. కాగా ప్రోమోలో మాత్రం ప్రియ ‘నేను మ్యారీడా, సెపరేటెడా, డివోర్స్ డా నాకే  తెలియదు’ అని కామెంట్ చేసింది. దీంతో ఆమె వైవాహిక జీవితం ఒడిదొడుకుల్లో ఉన్నట్టు అర్థమవుతోంది. ఆమె బెలూన్ పై ‘కేక్’అని ఇంగ్లిషులో రాసింది. అతనే తన ఫస్ట్ లవ్ అని చెప్పింది. బిగ్ బాస్ 5 సీజన్ ఆరంభ ఎపిసోడ్ లో కూడా నాగార్జునతో ప్రియ తను ఒంటరిగా బతకాల్సి వస్తే ఉండగలనా లేదా టెస్ట్ చేసుకునేందుకు బిగ్ బాస్ కు వచ్చానని చెప్పింది. దానికి నాగార్జున అలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నట్టు అన్నారు.  ఇప్పుడు తాజా ప్రోమోలో ప్రియ మాటలు వింటే ఆమె కాపురంలో కలహాలు ఉన్నట్టు అర్థమవుతోంది. 


ప్రియాంక కూడా తన మొదటి లవ్ తలచుకుని కన్నీటి పర్యంతమైంది. ‘తన బండి వెళ్లిపోతుంటే... ఆ బండి వెనుక పరిగెత్తాను అయినా తను వినలేదు, తన పని తనే చూసుకున్నాడు’ అంటూ ఏడ్చింది. హమీద కూడా ప్రేమలో ఉన్నట్టు ఒప్పుకుంది. తమ మధ్య బ్రేకప్ అవ్వలేదని, కానీ కలిసి ఉండలేకపోతున్నామంటూ ఎమోషనల్ అయింది. మొత్తమ్మీద ఈ ప్రోమో చూస్తుంటే ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉండడం ఖాయమనిపిస్తోంది.  


Also Read: ‘నాగార్జున’ అనేసి నాలుక కరుచుకున్న సమంత.. ఆ తర్వాత ‘మామ’ అంటూ ట్వీట్


Also Read: ప్రభుత్వం ఆధీనంలో సినిమా టికెట్లు.. లాభం ఎవరికీ? ఇక బెనిఫిట్ షోలు ఉండవా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.