హీరోలను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అభిమానులు తెలుగులో ఎక్కువ మంది ఉంటారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రాణంగా ప్రేమించడమే కాదు... దైవంగా కొలుస్తారు కూడా! అభిమాన హీరో సినిమా వస్తే థియేటర్లలో ఓ రేంజ్ హడావిడి చేస్తారు. పేపర్లు చింపి థియేటర్లలో గాల్లోకి విసురుతూ అభిమానాన్ని చూపిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అటువంటి సీన్స్ కామన్! అమెరికాలోని డల్లాస్‌లో ఓ థియేటర్ యాజమాన్యానికి అది నచ్చలేదు. ప్రేక్షకులను మధ్యలో పంపించేశారు. అసలు, వివరాల్లోకి వెళితే... 


గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy). ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన హైప్, క్రేజ్ మధ్య సినిమా విడుదలైంది. అటు అమెరికాలో తెలుగు ప్రజలు కూడా సినిమా చూడటానికి అమితమైన ఆసక్తి చూపించారు. 


అమెరికాలోని డల్లాస్ సిటీలో ఒక థియేటర్ యాజమాన్యానికి మాత్రం బాలకృష్ణ అభిమానులు చేసిన సందడి నచ్చలేదు. సెక్యూరిటీ అధికారులు వచ్చి థియేటర్ నుంచి వెళ్ళిపోమని చెప్పారు. అందుకు కారణం ఏంటో తెలుసా? ప్రేక్షకులు చూపించిన అభిమానమే. స్క్రీన్ మీద పేపర్లు విసురుతూ, గోల గోల చేసే సరికి షో మధ్యలో ఆపేశారు. 'అఖండ' సినిమా విడుదలైన సమయంలో కూడా అమెరికాలో థియేటర్‌లో సౌండ్ విషయంలో కంప్లైంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 'వీర సింహా రెడ్డి'కి ఇలా జరిగింది. 


అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్
బాలకృష్ణ క్రేజ్ అమెరికాలో పెరిగిందని చెప్పడానికి 'వీర సింహా రెడ్డి' సినిమాకు వస్తున్న వసూళ్ళు కారణమని చెప్పాలి. ఆల్రెడీ అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్స్ వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగాయి. సినిమా విడుదలైన తర్వాత వచ్చిన టాక్ బట్టి కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది చూడాలి. అక్కడ షోస్ తగ్గుతాయో? లేదంటే స్టడీగా ఉంటాయో?


ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్
బాలకృష్ణ కెరీర్ చూస్తే... 'వీర సింహా రెడ్డి'కి భారీ రిలీజ్ దక్కిందని చెప్పాలి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 1500 థియేటర్లలో విడుదలైంది. నైజాంలో 265, సీడెడ్ ఏరియాలో 200, ఏపీలో 410, ఓవర్సీస్ చూస్తే 500, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 100కు పైగా స్క్రీన్లలో సినిమా విడుదలైంది. 


Also Read : 'వీర సింహా రెడ్డి' రివ్యూ : బాలకృష్ణ విశ్వరూపం, వీర విహారం - ఫ్యాక్షన్ స్టోరీ, సినిమా ఎలా ఉందంటే? 


'క్రాక్' విజయం తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కించిన చిత్రమిది. 'అఖండ' విడుదల తర్వాత బాలకృష్ణ నుంచి వచ్చిన సినిమా కూడా ఇదే. ఇందులో ఫైట్స్ బావున్నాయని, 'వీర సింహా రెడ్డి'గా బాలకృష్ణ యాక్టింగ్ అద్భుతమని రివ్యూ రైటర్లతో పాటు ప్రేక్షకులు చెబుతున్నారు. యాక్షన్ సన్నివేశాలకు ఆయన ఇచ్చిన ఆర్ఆర్ అదిరిపోయిందని టాక్ వచ్చింది. 


Also Read : ప్రజలు ఎన్నుకున్న వెధవలు, బుద్ధి తెచ్చుకోండి - ఏపీలో జగన్ ప్రభుత్వంపై 'వీర...' లెవల్‌లో సెటైర్స్?


శ్రుతీ హాసన్ కథానాయికగా... హానీ రోజ్ మరో నాయికగా, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలో, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.