నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ ను, టీజర్ ను విడుదల చేశారు. ఇందులో బాలయ్య మాస్ అవతార్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాతో బాలయ్య మరో హిట్ అందుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 


ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. 'అఖండ' లాంటి హిట్టు సినిమా తరువాత బాలయ్య నటిస్తోన్న సినిమా కావడంతో మార్కెట్ లో కూడా సినిమాకి బాగా డిమాండ్ పెరిగింది. దానికి తగ్గట్లే డీల్స్ కూడావస్తున్నాయట . ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను రూ.58 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పాలి. థియేట్రికల్ బిజినెస్ కూడా ఇదే రేంజ్ లో జరుగుతుందని భావిస్తున్నారు. 


సిస్టర్ సెంటిమెంట్: 
ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ పుష్కలంగా ఉంటుందని తెలుస్తోంది. బాలయ్య చెల్లెలుగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. ఇద్దరి మధ్య బలమైన సన్నివేశాలు రాశాడట దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ పీక్స్ లో చూపించబోతున్నట్లు టాక్. యాక్షన్ తో పాటు ఎమోషన్ ను కూడా అదే స్థాయిలో క్యారీ చేయబోతున్నారని సమాచారం. 


టర్కీలో షూటింగ్:
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. హీరో హీరోయిన్ల మీద శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక పాటను తెరకెక్కించారు. కొన్ని సన్నివేశాలు తీశారు. అక్కడే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలు కూడా జరిగాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్నారు.


శ్రుతి హాసన్ కాకుండా సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మలయాళ భామ హానీ రోజ్ ఒకరు. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తమిళ అమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.


తాజాగా మరో సినిమా ఓకే చేశారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.